మున్సిపల్ రెవెన్యూ సిబ్బందిని నిలదీసిన నిర్మల్ వాసులు
Municipal Taxes: నిర్మల్, మార్చి 2 (మన బలగం): ‘పనులు చేయండి.. పన్నులు అడగండి’ అంటూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శనగర్, సాగర్ కాలనీ, గాజులపేట, బర్కత్ పుర కాలనీవాసులు ఆస్తి పన్నుల వసూళ్ల కోసం వెళ్లిన మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బందిని నిలదీశారు. తమ వీధుల్లో నయా పైసా అభివృద్ధి పనులు జరగడం లేదని, పారిశుధ్యం పట్ల దృష్టి పెట్టడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు సిబ్బందికి ఫిర్యాదులు చేసినా అసలే పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఆయా వీధుల్లోకి వెళ్లే పారిశుధ్య వాహనం నెల రోజులుగా రావడం లేదని కాలనీలవాసులు ఆరోపిస్తున్నారు. వాహనం రిపేర్లు ఉండడం వల్ల పారిశుధ్య వాహనం రాక కాలనీలోని చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయిందని వారు ఆరోపిస్తున్నారు. ముక్కు పిండి పన్నులు వసూలు చేసే మున్సిపల్ సిబ్బంది అభివృద్ధి పనులపై ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నించారు.
