SI Ashok warns strict action for election code violations in Lokeswaram: స్థానిక సంస్థల ఎన్నిక దృష్ట్యా అమలులో ఉన్న ఎన్నికల కోడ్ను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని లోకేశ్వరం ఎస్ఐ అశోక్ హెచ్చరించారు. ఆదివారం మండలంలోని రాయపూర్ కాండ్లీ గ్రామంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం, ర్యాలీలు తదితర కార్యక్రమాల కోసం సంబంధిత అధికారులను సంప్రదించి నిబంధనల ప్రకారం నిర్వహించుకోవాలని సూచించారు. అంతేకాకుండా ఇతర పార్టీల వారిని కించపరిచి వారి మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని తెలిపారు. నేరుగానైనా లేదా వివిధ ప్రసార మాధ్యమాలు లేదా సామాజిక మాధ్యమాల్లో వ్యవహరించి ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడితే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల సందర్భంగా కోడ్ అమలులో ఉన్నందున ప్రతి ఒక్కరూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకూడదని స్పష్టం చేశారు. రూ.50 వేలకు మించి నగదును రవాణా చేయకూడదని పేర్కొన్నారు. ఎక్కువ మొత్తంలో నగదును తీసుకెళ్తే తప్పనిసరిగా రశీదులు చూపించాలన్నారు. లేదంటే డబ్బులను సీజ్ చేసి కోర్టుకు తరలిస్తామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఓటర్లు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
