CPI Karimnagar
CPI Karimnagar

CPI Karimnagar: అవినీతిపై విజిలెన్స్ విచారణ జరిపించాలి

తీగల వంతెన, రివర్ ఫ్రంట్, చౌరస్తాల సుందరీకరణలో అక్రమాలు
CPI Karimnagar: కరీంనగర్, జనవరి 7 (మన బలగం): కరీంనగర్ నగర శివారులోని తీగల వంతెన నిర్మాణంలో, రివర్ ఫ్రంట్, నగరంలోని కూడళ్ల సుందరీకరణ పనులలో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విజిలెన్స్ విచారణ జరిపించాలని సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజులు ఒక సంయుక్త ప్రకటనలో డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో కరీంనగర్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెప్పి అప్పటి మంత్రి, ప్రస్తుత శాసనసభ్యులు గంగుల కమలాకర్ గుజరాత్ సబర్మతి నది ఒడ్డున ఉన్న తరహాలో కరీంనగర్‌లోనూ రివర్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని రూ.410 కోట్లతో రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ప్రారంభించారని తెలిపారు. డబ్బులు చాలవని రూ.480 కోట్లకు పెంచుకొని రివర్ ఫ్రంట్ నిర్మాణాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. కానీ ఇది నత్త నడకన మధ్యలోనే పనులను నిలిపివేయడం దుర్మార్గమైన చర్యని వారు ఆరోపించారు. దీని శంకుస్థాపనకు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి తారక రామారావును పిలిపించి హంగూ ఆర్భాటాలు చేశారు తప్ప పనిని మాత్రం పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన పనిలో పూర్తిగా బండ, ఇసుక, మొరం పూర్తిగా మానేరు డ్యామ్‌కు చెందినదేనని, ఇందులో భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపితే అధికారులు రాజకీయ నేతల ప్రమేయం బయటికి వస్తుందని అన్నారు.

రివర్ ఫ్రంట్ పనుల్లో పూర్తిగా నాసిరకం పనులు చేశారని ఆరోపించారు. నాణ్యమైన పనులు చేయడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేశారని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల కోట్ల రూపాయలు నీటిలో కలిసిపోయే ప్రమాదం ఉందన్నారు. దాదాపు 200 కోట్లకు పైగా ఎస్టిమేషన్‌తో ప్రారంభమైన తీగల వంతెన రూ.280 కోట్లతో నిర్మాణం చేశారని, ఈ యొక్క తీగల వంతెన నిర్మాణం జరిగి రెండు సంవత్సరాలు కావస్తోందని తెలిపారు. వంతెన పైనున్న రోడ్డు పూర్తిగా ధ్వంసమైందని, వంతెనపైన ఉన్న లైటింగ్ పూర్తిగా రావడం లేదని దీనికి బాధ్యులైన కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. కూడళ్ల సుందరీ కరణ పేర తెలంగాణ చౌక్‌తో పాటు అనేక చోట్ల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని నీటిపాలు చేశారని, మార్కెట్ నిర్మాణాల పేరుతో ఇష్టానుసారంగా దోచుకున్నారని, దీనికి బాధ్యులైన నగర మేయర్, ప్రజా ప్రతినిధులను దోషులుగా ప్రజల ముందు నిల్పాలన్నారు. కోట్ల రూపాయల పనులు మధ్యలో వదిలి వేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం గత పనులపై విచారణ జరిపి మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకొని పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయల కుంభకోణాలు కరీంనగర్ నగరంలో జరిగాయని, వీటన్నింటిపై విజిలెన్స్ విచారణ జరిపించి దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ రేస్, కాళేశ్వరం తదితర అవినీతిపనులపై విచారణ జరుగుతున్నాయని, కరీంనగర్ నగరపాలక సంస్థలలో జరిగిన అవినీతిపైనా కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపించాలన్నారు. లేని పక్షంలో సీపీఐ ఆందోళన చేస్తుందని సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *