- ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుదారులు రాయితీని సద్వినియోగం చేసుకోవాలి
- పెండింగ్ పనులన్నీ త్వరితగతిన పూర్తి చేస్తాం
- రూ. 6 కోట్ల 85 లక్షలతో బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన
- హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Whip Adi Srinivas: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, మార్చి 9 (మన బలగం): తిప్పాపూర్ నుంచి వేములవాడ పట్టణాన్ని అనుసంధానం చేసే రెండో వంతెన నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయిస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ రెండో బ్రిడ్జి నిర్మాణానికి రూ 6 కోట్ల 85 లక్షల వ్యయంతో ఆదివారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడారు. మర్రిపెల్లి రిజర్వాయర్, కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్, లచ్చపేట రిజర్వాయర్, చందుర్తి మోత్కరావుపేట రోడ్డు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయిస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారం, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చొరవతో భారీగా నిధులను ఈ ప్రాంత అభివృద్ధికి మంజూరు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల వేములవాడ పట్టణంలో సుమారు రూ. 700 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. రూ. 47 కోట్లతో రోడ్డు వెడల్పు, రూ.35 కోట్లతో నిత్య అన్నదాన సత్రం, ఆలయ విస్తీర్ణ చేపడుతున్నామని పేర్కొన్నారు.
భక్తులకు శీఘ్రంగా దర్శనం కలిగించేలా ఆలయ విస్తరణ చేపడుతున్నమని విప్ తెలిపారు. మే నెలలో శృంగేరి పీఠాధిపతి విధుశేఖర శేఖరశర్మ వేములవాడ కు రానున్నారని వెల్లడించారు. ఆలయ నిర్మాణ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామి వారి దర్శనాన్ని భీమేశ్వర ఆలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. ఉత్తమ విద్య అందించేలా రుద్రంగి మండల కేంద్రంలో ఎటీసి కాలేజ్, మేడిపల్లి జూనియర్ కళాశాల మంజూరు చేయడం జరిగిందని వివరించారు. బ్రిడ్జి నిర్మాణంలో నష్టపోయే వారికి తప్పకుండా నష్టపరిహారం చెల్లిస్తామని వెల్లడించారు. నష్టపోయే వారికి భూసేకరణ చట్టం ప్రకారం తప్పకుండా న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ తో పనుల్లో కొంత జాప్యమైందని చెప్పారు. దుకాణాలు పూర్తిగా కోల్పోతున్న వారికి మధ్య మార్గం ద్వారా ప్రత్యామ్నాయం చూస్తున్నామని తెలిపారు.రైల్వే లైన్లో భూమి పోతున్న వారికి కూడా తప్పకుండా న్యాయం చేస్తామని విప్ స్పష్టం చేశారు. త్వరలోనే లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. బస్ డిపో పక్కన ఆగిపోయిన ఇళ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు.
రూ.80 లక్షలతో మార్కెట్ సముదాయం
వేములవాడ పట్టణంలోని రెండవ బైపాస్ రోడ్ లో రూ.80 లక్షలతో అన్నీ ఒకే రకంగా కూరగాయల సముదాయం ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. కొనుగోలుదారులు, అమ్మకందారులకు ఉపయోగపడేలా, సౌకర్యంగా ఉండేలా నిర్మాణాలు చేయిస్తామని విప్ తెలిపారు. వేములవాడ పట్టణంలో ప్రతి వార్డులో 10 లక్షలతో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని ప్రకటించారు.ఇప్పటికీ పట్టణంలో 34 సంఘ భవనాల నిర్మాణాలకు నిధులు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. నిత్యం తాను ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటునన్నారు. కోనరావుపేట మండల పరిధిలో త్వరలోనే పెండింగ్లో ఉన్న బ్రిడ్జిల నిర్మాణాన్ని చేపడతామని ప్రకటించారు. వేములవాడ పట్టణంలో గంగమ్మ దేవాలయానికి ఒక నడిచిపోయేట్రాక్ ఏర్పాటు చేస్తామని విప్ తెలిపారు. ప్రజలు తమ ఫ్లాట్లను క్రమబద్దికరించుకునేందుకు ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. అర్హులైన వారందరూ తప్పకుండా వినియోగించుకోవాలని పిలుపు నిచ్చారు.తద్వారా 25 శాతం రాయితీ కల్పిస్తారని తెలిపారు. వేములవాడ నియోజకవర్గంలో అర్ధాంతరంగా ఆగిపోయిన అన్ని పనులను పూర్తి చేస్తామని విప్ ఆది శ్రీనివాస్ హామీఇచ్చారు.
