Bandi Sanjay Kumar Takes Charge: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఉదయం 11 గంటలకు నార్త్ బ్లాక్లో ప్రత్యేక పూజలు నిర్వహించి విధుల్లో చేరారు. పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవానికి జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ హాజరయ్యారు. స్వామీజీ బండి సంజయ్కు ఆశీర్వచనాలు అందజేశారు. సహచర మంత్రి నిత్యానంత రాయ్ బండికి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. భద్రతా కారణాల రీత్యా నాయకులు, కార్యకర్తల సందడి లేకుండానే సాదాసీదాగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంజయ్కి శుభాకాంక్షలు తెలిపేందుకు రాష్ర్టం నుంచి పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాతో సన్మానించారు. మిఠాయిలు పంచి ఆనందాన్ని పంచుకున్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సంజయ్ నివాసం సందడిగా కనిపించింది.