- జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్
- చుగ్తో భేటీ అయిన బండి సంజయ్

Bandi Sanjay Kumar meets Tarun Chugh: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శుక్రవారం బీజేపీ జాతీయ ప్రధాన కాదర్యర్శి తరుణ్ చుగ్తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటి సారిగా చుగ్ను కలిశారు. ఈ సందర్భంగా చుగ్, సంజయ్కు శుభాకాంక్షలు తెలిపారు. ఇరువురూ అరగంటకుపైగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. సంజయ్ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని చుగ్ ఆకాంక్షించారు. లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ర్టంలో బీజేపీ పరిస్థితిపై చర్చించిన వారు పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన అంశాలపై సమాలోచనలు చేశారు. తెలంగాణలో 8 పార్లమెంటు స్థానాలతో 35 శాతం ఓటింగ్ షేర్ను బీజేపీ కలిగి ఉందని ఈ సందర్భంగా బండి చుగ్కు వివరించారు.
ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మాట్లాడుతూ, ఎనిమిది లోక్సభ స్థానాలు కైవసం చేసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్లే ఇది సాధ్యమైందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదు నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందనడానికి పార్లమెంటు ఎన్నికల ఫలితాలే నిదర్శమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నిరాసక్తత నెలకొందనడానికి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డగోలుగా హామీలు ఇచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను వంచనకు గురిచేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చెప్పడానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయిందని, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని లోక్సభ ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నారని చెప్పారు.

బండికి అభినందనల వెల్లువ
కేంద్ర మంత్రిగా పదవీ ప్రమాణం స్వీకారం చేసిన బండి సంజయ్ కుమార్కు అభినందనల వెల్లువ కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కరీంనగర్తోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన పలువురు ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు సంజయ్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ర్టాలకు చెందిన 2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు సైతం సంజయ్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీలు సీతారంనాయక్, బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యేలు సంకినేని వెంకటేశ్వర రావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు సంజయ్ను కలిసి అభినందనలు తెలిపారు. వీరితోపాటు బీసీ కమిషన్ మాజీ సభ్యులు టి.ఆచారి, రాష్ర్ట అధికార ప్రతినిధులు ఎన్వీ సభాష్, వీరేందర్ గౌడ్, జె.సంగప్ప తదితరులు బండిని కలిసి అభినందనలు తెలిపారు.