Whip Laxman: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధర్మపురి మండలం దోనూర్ గ్రామంలో రూ.15 లక్షల వ్యయంతో, కమలాపూర్ గ్రామంలో రూ.13 లక్షల వ్యయంతో, నేరెళ్ల గ్రామంలో రూ.34 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఎరువుల గోదాములను మంగళవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు మేలు చేసే ఎరువుల గోదాములను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఎరువుల నిల్వలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఎరువుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని, రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేయనున్నట్లు తెలిపారు. రుణాలు మాఫీ కానీ రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదని, రుణమాఫీ కానీ రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నామని, వారి త్వరలోనే రుణ మాఫీ వర్తింపజేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను వందకు వంద శాతం అమలు చేయనున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతానికి సంబంధించి లిఫ్ట్లను గత ప్రభుత్వ అనాలోచిత విధానాలతో పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి వాటికి మరమ్మతులు చేసి పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. 2016లో ప్రారంభమైన రోళ్ల వాగును గత ప్రభుత్వ హయాంలో పూర్తి చేయలేదని, దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఈ విషయాన్ని కలెక్టర్తో మాట్లాడి పూర్తి చేస్తామని తెలిపారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి ధర్మపురి నియోజకవర్గ ప్రాంత రైతాంగానికి నీరు అందిస్తామని వెల్లడించారు.