Nirmal Collector: పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు.బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశం మందిరంలో పర్యావరణహితమైన మట్టి విగ్రహాల వినియోగంపై అవగాహన పెంచేందుకు, కాలుష్య నియంత్రణ మండలి వారి పోస్టర్లను జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తోడ్పడాలని, వినాయక చవితిని పురస్కరించుకొని మట్టి వినాయకులనే ప్రతిష్టించాలని కోరారు. మట్టి విగ్రహాల వినియోగాన్ని పెంచేందుకు ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలని సూచించారు. పట్టణాలు, గ్రామాలలోని ముఖ్యమైన కూడళ్ళు, బస్టాండులు, తదితర ప్రాంతాలలో హోర్డింగులు, పోస్టర్లు ఏర్పాటు చేసి మట్టి గణేష్ విగ్రహాల ఆవశ్యకతను తెలియజేయాలన్నారు.
రసాయన రంగుల ద్వారా కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాలన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణహితమైన మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. మట్టి విగ్రహాల తయారీని ప్రోత్సహించడం ద్వారా చేతి వృత్తుల వారికి జీవనోపాధిని కల్పించిన వారమవుతామని అన్నారు. మట్టి విగ్రహాల వినియోగంపై విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, క్విజ్ పోటీలను నిర్వహించి ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ విజయలక్ష్మి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్, కాలుష్య నియంత్రణ మండలి ప్రతినిధులు రంజిత్ కుమార్, లక్ష్మణ్ ప్రసాద్, మెప్మా పీడీ సుభాష్, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.