prajavani: నిర్మల్, డిసెంబర్ 2 (మన బలగం): ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, రెండు పడక గదుల ఇండ్లు వంటి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు తమ అర్జీలను సమర్పించారు. ప్రజావాణి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. శాఖల వారీగా ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, సీఎం ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. శాఖల వారీగా ప్రజావాణి కార్యక్రమమంలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించినప్పుడు వాటికి సంబంధించిన వివరాలను క్లుప్తంగా రిమార్కుల విభాగంలో పొందుపరుచాలని ఆదేశించారు. దరఖాస్తుదారులకు పరిష్కారానికి సంబంధించిన వివరాలను అందజేయాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా అధికారులంతా శాఖల వారీగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ నెల 6న రాష్ట్ర విద్యా కమిషన్ జిల్లాలో పర్యటించనుంది తెలిపారు. సీఎం కప్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.