AISF State President: కరీంనగర్, డిసెంబర్ 28 (మన బలగం): తెలంగాణ విభజన హామీలు అమలు చేయడంలో మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, కరీంనగర్లో త్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయకుండా అలసత్వం వహిస్తోందని, విభజన హామీలు అమలు అయ్యేలా కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి డిమాండ్ చేశారు. విభజన హామీ ప్రకారం పదేళ్లు దాటినా కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటుకాలేదని, కరీంనగర్ జిల్లాకు రావాల్సిన ట్రిపుల్ ఐటీ గతంలో కర్ణాటక, రాయచూరుకు మంజూరు చేశారన్నారు. ఇప్పటికీ ట్రిపుల్ ఐటీ మంజూరు చేయలేదని, గతంలో కరీంనగర్ జిల్లాకు సైన్స్ సెంటర్కు స్థలం మంజూరైనా నిర్మాణ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. శాతవాహన యూనివర్సిటీకి న్యాక్ గుర్తింపురాలేదన్నారు. శాతవాహన యూనివర్సిటీకి రూ.200 కోట్ల నిధులు తీసుకురావాలని, కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని విద్యార్థి, నిరుద్యోగ యువతకు విద్య, ఉపాధి అవకాశాలు స్థానికంగా దక్కేలా కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు, చిన్న, పెద్ద తరహా కంపెనీలు, పరిశ్రమలు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఏర్పాటు అయ్యేలా కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకోవాలన్నారు. తెలంగాణ విభజన హామీల ప్రకారం తెలంగాణలో ప్రతి జిల్లాకో నవోదయ పాఠశాల, కేంద్రీయ విద్యాలయం, ట్రిపుల్ ఐటీ, ఐఐఎం లాంటి అనేక ఉన్నత విద్యాసంస్థల కేటాయింపులు చేయాలని విభజన హామీ చట్టం చెప్పినప్పటికీ అమలు కాలేదన్నారు. విభజన హామీల అమలు జరిగేలా కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషి చేయాలని మణికంఠరెడ్డి డిమాండ్ చేశారు.