Nirmal Festivals: నిర్మల్, డిసెంబర్ 31 (మన బలగం): నిర్మల్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్మల్ ఉత్సవాల కార్యక్రమం ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్లతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ‘నిర్మల్ ఉత్సవాలు’ పేరిట జనవరి 6నుంచి 8వ తేదీ వరకు పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఉంటుందని తెలిపారు. సాయంత్రం వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. అధికారులకు కేటాయించిన బాధ్యతలను పకడ్బందీగా నిర్వహించి నిర్మల్ ఉత్సవాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. నిర్మల్ ఉత్సవాల్లో భాగంగా నిర్మల్ చరిత్ర తెలిసేలా వివిధ శాఖల నుంచి స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. మహిళా స్వయం సంఘాల ఉత్పత్తులు, వ్యవసాయ, కొయ్య బొమ్మలు, పెయింటింగ్స్, హస్తకళలు, పుస్తకాలు, దుస్తులు, తినుబండారాల స్టాళ్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. నిర్మల్ ఉత్సవాల కార్యక్రమంపై హోర్డింగ్లు, కరపత్రాల ద్వారా ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.
జిల్లాకు చెందిన ప్రముఖ వ్యక్తులను గుర్తించి వారిని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని తెలిపారు. నిర్మల్ జిల్లా చరిత్రను తెలిపే విధంగా పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రజలను ఆకట్టుకునే విధంగా అందమైన విద్యుత్ దీపాలతో ముస్తాబు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలనీ, అగ్నిమాపక, అత్యవసర వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. ఆసక్తి కలిగిన ప్రజలు ఎవరైనా తమ ఉత్పత్తుల స్టాళ్లను ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేయాలనుకుంటే ఈ వెబ్ సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. https://docs.google.com/forms/d/1h5XUPVatFSTOHi0_ZjzkFWMRMZIynqxPQ_wXk8rcQog/edit ఇతర వివరాల కోసం 9849913071 ఫోన్ నంబరును సంప్రదించాలాన్నారు. సమావేశంలో ప్రణాళిక అధికారి జీవరత్నం, డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, డీఈఓ పి.రామారావు, డిఆర్డిఓ విజయలక్ష్మి, డిపిఓ శ్రీనివాస్, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్, డీఎంహెచ్ఓ రాజేందర్, డిఎస్ఓ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, డిపిఆర్ఓ విష్ణువర్ధన్, మెప్మా పిడి సుభాష్, తహసిల్దార్ రాజు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.