Distribution of Kalyan Lakshmi Cheques: పెగడపల్లి, జనవరి 8 (మన బలగం): పెగడపెల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సీఎంఆర్ఎఫ్, కళ్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేసారు. కార్యక్రమానికి ముందు పెగడపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు స్వాగతం పలికారు. పోలీస్ స్టేషన్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, రైతు భరోసా అమలు చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి మండల నాయకులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా 61 లక్షల 16 వేల 5 వందల రూపాయల విలువ గల 219 సీఎంఆర్ఎఫ్ చెక్కులను, 93 లక్షల రూపాయల విలువగల 93 కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ఇటీవల గల్ఫ్లో మృతి చెందిన పెగడపెల్లి మండల కేంద్రానికి చెందిన బైరా శ్రీనివాస్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరు అయినా 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రొసీడింగ్ కాపీని శ్రీనివాస్ కుటుంబానికి అందజేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి చెక్కులను అందుకున్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిజేస్తున్నమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను అమలు చేయనున్నట్లు చెప్పారు. దానిలో భాగంగా ఈ నెల 26 నుంచి సాగు చేసుకున్న రైతుకు భరోసా ఇచ్చే విధంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు చెప్పారు. రైతులకు ఇప్పటికే 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ చేసామన్నారు. ఇంకా రుణమాఫీ కానీ వారు ఎవరైనా ఉంటే వారికి సైతం రుణాలను మాఫీ చేసి తీరుతామని, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వారు ఎవరైనా అక్కడే మృతి చెందితే వారి కుటుంబానికి భరోసా ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందించనున్నట్లు తెలిపారు. గత బిఆర్ఎస్ పాలకులు గల్ఫ్లో మృతిచెందిన వారి గురించి, వారి కుటుంబాల గురించి కనీసం పట్టించుకోలేదన్నారు. కానీ మొదటి సారి కాంగ్రెస్ ప్రభుత్వం వారి కుటుంబాలకు ఒక ధైర్యం ఇచ్చే విధంగా ఈ స్కీమ్ను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేస్తామని, గ్రామసభ నిర్వహించి అర్హులైన వారికే ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.