Whip Adi Srinivas
Whip Adi Srinivas

Whip Adi Srinivas: స్వగ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా: ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్

  • రూ.2 కోట్లతో అభివృద్ధి పనులకు భూమి పూజ
  • హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

Whip Adi Srinivas: మనబలగం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: తనకు జన్మనిచ్చిన స్వగ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ తెలిపారు. రుద్రంగి మండల కేంద్రంతో పాటు ఉమ్మడి మానాల పరిధిలో రూ.2 కోట్ల 3 లక్షలతో నూతన సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్‌ల నిర్మాణానికి గురువారం ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, రాష్ట్ర కో ఆపరేటివ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డితో కలసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదం, ప్రోత్సాహం వల్ల రుద్రంగి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని వివరించారు. రుద్రంగిని ఆదర్శంగా నిలిపేందుకు కలెక్టర్ సహకారాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. నూతన కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా జనవరి 26 నుండి మంజూరు చేయబోతున్నామని వెల్లడించారు.

మిడ్ మానేరు ముంపు గ్రామాల ప్రజలకు 238 కోట్లతో 4696 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఎలాంటి షరతులు లేకుండా రైతు భరోసా రైతులకు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. రుద్రంగిలో మెయిన్ రోడ్డులో సైడ్ డ్రైన్ ను రూ.1 కోటి 27 లక్షలతో నిర్మాణం చేసుకున్నామని, మన గ్రామంలో రోడ్డు ఎత్తుగా ఉంటే వాటికి అనుసంధానంగా 12 ప్రాంతాల్లో మెయిన్ రోడ్డుకు కలుపుకున్నామని పేర్కొన్నారు. కేజీబీవిలో ప్రహరీ గోడ నిర్మాణం చేపడుతున్నాం. బోర్ వెల్ కూడ మంజూరు చేసుకున్నామని తెలిపారు. జిల్లాలో మొట్టమొదట సారిగా కేజీబీవి విద్యార్థులకు ఐఐటి, జేఈఈ, నీట్ కోచింగ్ కోసం జిల్లా కలెక్టర్ చొరవతో ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రారంభం చేసుకున్నామని గుర్తు చేశారు. రూ.16 లక్షలతో దసరా, బతుకమ్మ పండుగ సందర్బంగా సెంట్రల్ లైట్స్ ఏర్పాటు చేసుకున్నామని, రూ. కోటి 50 లక్షలతో అంబేద్కర్ చౌరస్తా నుంచి హనుమాన్ ఏరియా మీదిగా  ఇందిరా చౌక్ వరకు సీసి రోడ్డు మంజురు చేసుకున్నామని తెలిపారు. రుద్రంగి వాసుల చిరకాల కోరిక ప్రభుత్వ ఆసుపత్రికి భూమి పూజ చేసుకున్నామని, ఇప్పటికే పనులు శరవేగంగా  సాగుతున్నాయని వివరించారు. 6 నెలల్లో ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని విప్ తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో 43 కోట్లతో మన గ్రామానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మంజూరు చేసుకున్నామని గుర్తు చేశారు. రామకృష్ణపూర్ పల్లెకు వెళ్ళడానికి 60 లక్షలతో కల్వర్ట్ నిర్మాణనికి భూమి పూజ చేసుకున్నామని చెప్పారు. మర్రిపల్లి, కలికోట రిజర్వాయరు పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. చందుర్తి -మోతుకురావుపేట రోడ్డు నిర్మాణానికి అనుమతులు తీసుకొచ్చామన్నారు. త్వరలోనే మొదటి దశ పనులు ప్రారంభం అవుతాయయని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరా మహిళ పథకాన్ని తీసుకువచ్చారని తెలిపారు. జిల్లాలో 600 కోట్లను మహిళా తల్లులకు కేటాయించడం జరిగిందని విప్ వెల్లడించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించి, మద్దతు ధరతో కొనుగోలు చేశామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో మహిళ తల్లులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, ఆరోగ్య శ్రీ పరిమితి 10 లక్షల వరకు పెంచామని వెల్లడించారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని గుర్తు చేశారు. దేశ చరిత్ర లోనే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఏక కాలంలో 2 లక్షల రుణమాఫి చేయడం జరిగిందని తెలిపారు.

అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు పట్టిష్ట కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. రైతు భరోసాకు సంబంధించి అధికారులు వ్యవసాయ యోగ్యమైన భూమో కాదా అని మాత్రమే పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు. భూ భారతి (ధరణి) నుంచి వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించి రైతు భరోసా జాబితా నుంచి సదరు లబ్దిదారులను తొలగించాలని అన్నారు. రైతు భరోసా కింద ఏడాదికి ప్రతి ఎకరాకు 12 వేల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని అన్నారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు పంట వేసినా, వేయక పోయినా రైతు భరోసా అందుతుందని స్పష్టం చేశారు. భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఏడాదికి 12,000 రూపాయలకు రెండు విడతలుగా అందించేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించిందన్నారు. సామాజిక ఆర్థిక సర్వే కింద జిల్లాలో 9వేల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు లేదని తేలిందని, మండలాలలో ఎంపీడీవోలు, పట్టణాలలో మున్సిపల్ కమిషనర్ నూతన రేషన్ కార్డుల జారీ పర్యవేక్షించాలని అన్నారు.

గ్రామ లేదా వార్డు సభల ద్వారా అర్హులైన జాబితాను ఆమోదింప చేసుకొని రేషన్ కార్డులను గణతంత్ర దినోత్సవ సందర్భంగా నూతన రేషన్ కార్డుల ప్రోసిడింగ్స్ పంపిణీ చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి నిర్వహించిన సర్వేలో భూములు కొన్న అత్యంత పేదలకు మొదటి జాబితాలో మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. జనవరి 16 నుంచి 20 వరకు క్షేత్రస్థాయి పరిశీలన చేసి జనవరి 21 నుంచి 24 వరకు గ్రామసభలు నిర్వహించి ప్రభుత్వం చేపడుతున్న 4 కార్యక్రమాల మార్గదర్శకాలు, ఉద్దేశం ప్రజలకు వివరిస్తూ పథకాల అర్హుల జాబితాను ప్రజలందరికీ తెలిసేలా ప్రదర్శించాలన్నారు. ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత తుది జాబితా తయారు చేసే జనవరి 26 నుంచి 4 పథకాల అమలును ప్రారంభించాలని కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలోమార్కెట్ కమిటి చైర్మన్ చెలకల తిరుపతి, ఈఈ సుదర్శన్ రెడ్డి, డి ఆర్ డి వో శేషాద్రి, డి ఈ పవన కుమారి, ఎంపీడీవో నటరాజ్, ఎమ్మార్వో శ్రీలత, ఏ ఈ మనోహర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *