Bandi Sanjay
Bandi Sanjay

Bandi Sanjay: ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ పనితీరు భేష్

  • సీడీటీఐ శిక్షణా తీరును అభినందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
  • సీఎఫ్ఎస్ఎల్, ఎన్ఎఫ్సీఎల్, సీడీటీఐ సంస్థలను సందర్శించిన కేంద్ర మంత్రి
  • ప్రతి విభాగాన్ని పరిశీలించిన బండి సంజయ్
  • అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దడం అభినందనీయమన్న కేంద్ర మంత్రి

Bandi Sanjay: మనబలగం, తెలంగాణ బ్యూరో: భారతదేశంలో ఎక్కడ ఎలాంటి నేరాలు జరిగినా నిందితులను పట్టుకునేందుకు దోహదపడే వ్యవస్థ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలతోపాటు నార్కొటిక్, సైబర్, మనీ లాండరింగ్ నేరాలకు పాల్పడిన దోషులను పట్టుకునేందుకు దొహదపడేలా ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో సీఎఫ్ఎస్ఎల్ సంస్థను తీర్చిదిద్దిందని తెలిపారు. గురువారం మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌తో కలిసి హైదరాబాద్ రామాంతాపూర్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ (సీఎఫ్ఎస్ఎల్), నేషనల్ సైన్స్ ఫోరెన్సిక్ లాబోరేటరీ (ఎన్సీఎఫ్ఎల్), సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (సీడీటీఐ) సంస్థలను కేంద్ర మంత్రి సందర్శించారు. రెండున్నర గంటలపాటు అక్కడే గడిపారు. ఆయా సంస్థల్లోని ప్రతి విభాగానికి వెళ్లి పరిశీలించారు.

అధికారులతో సమావేశమై ఆయా విభాగాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. దక్షిణ భారత దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థలు హైదరాబాద్‌లో ఉండటం గర్వకారణమన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి వేలాది కేసుల పరిష్కారానికి ఈ సంస్థలను సంప్రదిస్తున్నారని అధికారులు కేంద్ర మంత్రికి తెలిపారు. నేర పరిశోధనకు అవసరమైన ప్రామాణిక పత్రాలను సీఎఫ్ఎల్ఎల్ అందజేస్తోందని వెల్లడించారు. తొలుత సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీని సందర్శించిన బండి సంజయ్‌ను సంస్థ జాతీయ విభాగం డైరెక్టర్ ఎస్.కే.జైన్, హైదరాబాద్ ఇన్‌చార్జి రాజీవ్ గిరోటీ స్వాగతం పలికారు. ఈ సంస్థ ఉన్నతాధికారులతో సమావేశమైన కేంద్ర మంత్రి సీఎఫ్ఎస్ఎల్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ ఫోరెన్సిక్ డివిజన్, ఆక్సిజన్ ఫోరెన్సిక్ డివిజన్, డీఎన్ఏ, బయాలజీ డివిజన్, నార్కోటిక్, కెమిస్ట్రీ డివిజన్, ఫిజిక్స్ డివిజన్, సైకాలజీ డివిజన్ తోపాటు డాక్యుమెంటేషన్ డివిజన్లను సందర్శించారు. క్లిష్లమైన కేసుల పరిష్కారంలో అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు.

భవిష్యత్ కార్యాచరణపై అధికారులను అడిగి తెలుసుకోవడంతోపాటు కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు తగిన ప్రతిపాదనలను కోరారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంస్థ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఎన్సీఎఫ్ఎల్, సీడీటీఐ సంస్థలను కేంద్ర మంత్రి సందర్శించారు. అక్కడ సైతం ప్రతి విభాగాన్ని సందర్శించారు. అధికారులతో సమావేశమయ్యారు. ఆయా సంస్థల పనితీరుపై సంబంధిత శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలీసులకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు, న్యాయవాదులకు ఇప్పటి వరకు 39,167 మందికి సీటీడీఐ అధికారులు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సైబర్ నేరాలపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. కేంద్ర మంత్రి సంస్థ అధికారులను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *