minister seethakka: నిర్మల్, జనవరి 17 (మన బలగం): ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంక్షేమ పథకాల అమలుపై ఉమ్మడి జిల్లా స్థాయి ప్రణాళిక కార్యాచరణ సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, అభిలాష అభినవ్, రాజార్షి షా, కుమార్ దీపక్, వెంకటేష్ దోత్రే, ఎమ్మెల్సీ దండే విట్టల్, శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వెడ్మ బొజ్జు పటేల్, రామారావ్ పటేల్, పాయల శంకర్, అధికారులతో సమావేశం నిర్వహించారు.
మంత్రికి ఘన స్వాగతం

సంక్షేమ పథకాల అమలుపై ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్ష సమావేశానికి హాజరైన మంత్రికి జిల్లా కలెక్టర్ పూల మొక్కతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. నాయకులు, అధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.
పథకాల అమలు పారదర్శకంగా జరగాలి: మంత్రి సీతక్క

పథకాలలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని, అర్హులైన లబ్ధిదారులకే పథకాలు అందే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారులు, నాయకులపై ఉందని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. సమావేశంలో పాల్గొని మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాలు అర్హులకే అందేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. జనవరి 26 నుంచి ప్రారంభించనున్న పథకాలను రెవెన్యూ, పంచాయతీ రాజ్, వ్యవసాయ, సంబందిత శాఖల అధికారులంతా సమన్వయంతో పనిచేసి, లబ్దిదారులను పకడ్బందీగా ఎంపిక చేయాలన్నారు. అర్హులైన వారందరికీ పథకాలు అందజేసే బాధ్యత అధికారులదేనన్నారు. రైతుభరోసా పథకానికి సంబందించి సాగుకు యోగ్యంకాని భూములను గుర్తించాలని ఆదేశించారు. గ్రామాల్లో గ్రామ సభలు, పట్టణాల్లో వార్డు సభలను నిర్వహించి గుర్తించిన అర్హుల వివరాలను వెల్లడించాలన్నారు. ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. అలాగే ఉమ్మడి జిల్లాలో నిరుపేదలందరికీ మెరుగైన విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్, రోడ్డు సౌకర్యం, తదితర వసతులు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవలే నిర్మల్ ఉత్సవాలను విజయంతంగా నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్కు, అధికారులకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రణాళిక బద్ధంగా సర్వే: కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రభుత్వం నిర్దేశించిన ప్రణాళిక బద్ధంగా లబ్ధిదారుల ఎంపిక కోసం సర్వేలు నిర్వహించి పూర్తి చేస్తామని, అర్హులైన వారికే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందే విధంగా కృషి చేస్తామని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. జిల్లాలో నూతన పథకాల అమలుకోసం అర్హులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించామన్నారు. పథకాల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగిందని తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపడతామని, జిల్లాలో నూతన రేషన్ కార్డుల కోసం 17491 దరఖాస్తులు వచ్చాయని, సర్వే ద్వారా ఇప్పటివరకు 2924 మంది అర్హులను గుర్తించనట్లు తెలిపారు. దీనికి సంబందించి సర్వే కొనసాగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాల లబ్ధిదారుల వివరాలు గ్రామ, వార్డు సభలను నిర్వహించి గ్రామ సభల ఆమోదంతో సమగ్ర జాబితాను సిద్దం చేస్తామని తెలిపారు.
అర్హులకు సంక్షేమ ఫలాలు అందే విధంగా చూడాలి :నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు, రైతు భరోసా, రైతుభరోసా, ఇందిరమ్మ ఇండ్ల వంటి పథకాలు అర్హులైన నిరుపేదలందరికీ అందేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. క్షేత్ర స్థాయిలో లబ్దిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా ఉండాలన్నారు.
ఏజెన్సీ ప్రాంత ప్రజలకు న్యాయం జరగాలి: ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు
ఖానాపూర్ శాసనసభ్యలు వెడ్మా బొజ్జు పటేల్ మాట్లాడుతూ, సంక్షేమ పథకాల అమలులో ఏజెన్సీ ప్రాంతాల నిరుపేదలకు న్యాయం జరగాలని కోరారు. క్షేత్రస్థాయి సర్వేలో నిరుపేదలను గుర్తించి వారికి పథకాలను అమలు చేయాలన్నారు.
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరు పాటించాలని నాయకులు అధికారులు ప్రజలకు సూచించారు. అంతకుముందు రోడ్డు భద్రత మాసోత్సవాల పోస్టర్లను మంత్రి సీతక్క, కలెక్టర్లు, అధికారులతో కలిసి ఆవిష్కరించారు. వాహనదారులు ఖచతంగా హెల్మెట్ సీట్ బెల్ట్ లు ధరించి రోడ్డు భద్రత నియమాలను పాటించాలని కోరారు.ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు రాజర్షి షా, కుమార్ దీపక్, వెంకటేశ్ ధోత్రే, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, నిర్మల్, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, కుష్బూ గుప్తా ( ఐటిడిఒ పిఓ), శ్యామలా దేవి, దీపక్ తివారి, శాసనసభ్యులు రామారావ్ పటేల్, పాయల శంకర్, అనిల్ జాదవ్ లు, మున్సిపల్ చైర్మెన్లు గండ్రత్ ఈశ్వర్, మేడిపల్లి సత్యం, గ్రంథాలయ చైర్మెన్ సయ్యద్ అర్జుమంద్ అలి, మార్కెట్ కమిటీ చైర్మెన్లు ప్రజాప్రతినిధులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.