- ఔట్ సోర్సింగ్ పీర్వోల చేతి వాటం
- అవకతవకలపై సీబీసీఐడీకి ఫిర్యాదు చేస్తాం
Sadaram certificates: కరీంనగర్, ఫిబ్రవరి 13 (మన బలగం): సదరం సర్టిఫికెట్ల అవకతవకలపై సంబంధించిన అధికారులు చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగేంధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సదరం సర్టిఫికెట్లలో లక్షల రూపాయల కుంభకోణంపై సీబీసీఐడీ విచారణ జరిపించాలని తాము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నామన్నారు. అధికారులందరూ లక్షల రూపాయలను పప్పుబెల్లంలా పంచుకున్నారని ఆరోపించారు. పాత్రధారులు, సూత్రధారులు అందరూ ఆ శాఖలోనే ఉన్నారని ఆరోపించారు. ఒక డిపార్ట్మెంట్ వారు తప్పు చేస్తే వేరే డిపార్ట్మెంట్ అధికారితో పూర్తిస్థాయిలో పారదర్శకంగా విచారణ జరిపిస్తారని, కానీ దానికి విరుద్ధంగా ఈ విచారణ జరిగిందన్నారు. నిబంధనల ప్రకారం సదరం క్యాంపు 200 మందికి మాత్రమే స్లాట్ బుకింగ్ విధానం ఉంటుందని, కానీ దానికి భిన్నంగా హుజురాబాద్లో సదరం క్యాంపు ఆకస్మికంగా నిర్వహించడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. అడిషనల్ డీఆర్డీవో వెంకటేశ్వర్లు నేతృత్వంలో జరిగిన విచారణ కమిటీ గత యేడాది జనవరి 2021 నుంచి 2022 ఫిబ్రవరి వరకు విచారణ జరిపి కలెక్టర్కు నివేదిక సమర్పించిందని, కానీ హుజురాబాద్లో జరిగిన సదరం సర్టిఫికెట్లపై విచారణ ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు లక్షల రూపాయలు వసూలు చేశారని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారి వెనుక ఉన్న పాత్రదారులు, సూత్రధారులను బయటకు లాగాలన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.