Vehicle thief arrested: జగిత్యాల ప్రతినిధి, జనవరి 17 (మన బలగం): జగిత్యాల పోలీసులు ఎట్టకేలకు వాహనాలను చోరీ చేస్తున్న దొంగను పట్టుకొన్నారు. జగిత్యాలలోని వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన వాహనాలను పట్టుకొన్నారు. జగిత్యాలలో శుక్రవారం సీఐ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ ఆదేశాల మేరకు జగిత్యాల శివారు దరూరు కేనాల్ ప్రాంతంలో వాహనాల తనిఖీ చేపట్టారు. నెంబర్ప్లేట్ లేని హోండా షైన్పై వచ్చిన అమీర్ అనే వ్యక్తి బండి పత్రాలు అడిగితే తడబడుతూ జవాబు ఇవ్వడంతో పాటు పారిపోయే ప్రయత్నం చేసాడు. అనుమానించి విచారణ చేస్తే జగిత్యాల పట్టణంలో వాహనాల చోరీకి పాల్పడింది అమీర్ అని తెలిసింది. గత నెలలో రిలయన్స్ ట్రెండ్స్ ముందు పల్సర్ బైక్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాస్పిటల్ ముందు చోరీకి గురైన హెచ్ఎఫ్ డీలక్స్ వాహనాలను, తనిఖీలో పట్టుబడ్డ వాహనాలను సీజ్ చేశామని సీఐ పేర్కొన్నారు. ఇదివరకే తన వాహనం పోయిందని స్థానిక కృష్ణానగర్కు చెందిన గుర్రం శరత్ కుమార్ ఫిర్యాదు అనుసరించి ఈ తనిఖీలను చేపట్టారు. నిందితుడు అమీర్పై భారత న్యాయ సంహిత చట్టాలను అనుసరించి కేసులు నమోదు చేశామని టౌన్ సీఐ వేణుగోపాల్ పేర్కొన్నారు.