Nirmal Collector: నిర్మల్, జనవరి 18 (మన బలగం): నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ కల్పనలో డీట్ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ జిల్లా కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పనకై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన డీట్ యాప్లో కళాశాలల విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకునే విధంగా అధికారులు ప్రోత్సహించాలని తెలిపారు. అధికారులు ఈ యాప్పై విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. డైట్ యాప్లో తమ విద్యార్హతలతో పేరును నమోదు చేసుకోవడం ద్వారా వివిధ ప్రైవేటు కంపెనీలు, పరిశ్రమలు వారికి అవసరమయ్యే ఉద్యోగులను నియమించుకుంటుందని తెలిపారు. నిరక్షరాస్యులు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఈ యాప్లో తమ పేరును నమోదు చేసుకోవచ్చునన్నారు. నిరుద్యోగులు ఇచ్చిన సమాచారం క్రోడీకరించుకొని యాప్లో ఆన్లైన్ రెస్యూమ్ను పొందుపరుస్తుందని తెలిపారు.
ఆ సమాచారం ఆధారంగా కంపెనీలు నిరుద్యోగుల్ని సంప్రదిస్తాయని తెలిపారు. ఇందులో తమ పేర్లను నమోదు చేసుకోవడం ద్వారా నైపుణ్యానికి తగ్గ వేతనం లభిస్తుందన్నారు. పలు కంపెనీలో ఖాళీలను డీట్ యాప్లో పొందుపరుస్తాయని తెలిపారు. డీట్ యాప్ నిరుద్యోగులకు కంపెనీలకు మధ్య వారధిలా పని చేస్తుందన్నారు. ఈ యాప్ ద్వారా నిరుద్యోగులు పారదర్శకంగా తమ విద్యార్హతకు తగిన ఉద్యోగాన్ని పొందవచ్చు అన్నారు. నిరుద్యోగులకు అప్రెంటిస్, ఇంటర్న్ షిప్ల సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తుంది అన్నారు. ఇప్పటివరకు ఈ యాప్లో నమోదు చేసుకున్న జిల్లా నిరుద్యోగుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటివరకు జిల్లాకు చెందిన ప్రజలు అనధికారిక ఏజెంట్ల ద్వారా ఇతర దేశాలకు ఉపాధి కోసం వెళ్లినట్లయితే వారి వివరాలను వారి కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలోని కార్మిక శాఖ కార్యాలయంలో వారి ఆధార్ కార్డుతో రేపటి నుంచి 26వ తేదీ లోపు సంప్రదించి వివరాలు నమోదు చేయించాలని తెలిపారు. ఇతర వివరాలకు 9866072044 నంబరును సంప్రదించవచ్చునని తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల మేనేజర్ నరసింహారెడ్డి, సీపీవో జీవరత్నం, మెప్మా పీడీ సుభాష్, జిల్లా కార్మిక అధికారి ముత్యం రెడ్డి, డీవైఎస్వో శ్రీకాంత్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.