arrangements for Republic Day celebrations: మనబలగం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం గణతంత్ర వేడుకల నిర్వహణపై జిల్లా అధికారులతో తన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించడానికి వీలుగా గ్రౌండ్ను, డయాస్ను పోలిస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పూల అలంకరణతో సిద్ధం చేయాలన్నారు. వేడుకల సందర్భంగా ప్రజా ప్రతినిధులకు, జిల్లా అధికారులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, ప్రజలకు సీటింగ్ ఏర్పాట్లు ప్రొటోకాల్ ప్రకారం చేయాలని సిరిసిల్ల రెవెన్యూ డివిజనల్ అధికారిని, సిరిసిల్ల తహసీల్దార్ను ఆదేశించారు. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలు జరుగుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలతో కూడిన స్టాళ్ల ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గణతంత్ర వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడానికి వీలుగా, వివిధ అభివృద్ది సంక్షేమ పథకాలతో కూడిన ప్రగతి సందేశాన్ని తయారు చేయాలని జిల్లా పౌర సంబంధాల అధికారిని ఆదేశించారు. వేడుకల సందర్భంగా ప్రజలకు, విద్యార్థినీ, విద్యార్థులకు వాటర్ బాటిల్స్ సమకూర్చాలని, మున్సిపల్ అధికారులను, ఈ వేడుకల్లో జాతీయ భావం పెంపోందెలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని డీఈవోను ఆదేశించారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రసంశ పత్రాలను ప్రధానం చేసేందుకు ఇంతవరకు ప్రశంస పత్రములు పొందని ఉత్తమ సేవలందించిన ఉద్యోగులను ఎంపిక చేసి జనవరి 24 లోగా ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పి చంద్రయ్య, సిరిసిల్ల ఆర్డిఓ వెంకటరెడ్డి, డి.పి.ఆర్.ఓ. శ్రీధర్, కమిషనర్ లావణ్య, డీఈవో జగన్మోహన్ రెడ్డి, సిరిసిల్ల తహసిల్దార్ ఉమారాణి, కలెక్టరేట్ ఏవో రామ్ రెడ్డి, ఏ.డి. హ్యాండ్లూమ్స్ & టెక్స్టైల్ సాగర్, ఏఆర్.ఆర్.ఐ.లు మధుకర్, రమేష్ పాల్గొన్నారు.