- ఇందిరా మహిళా శక్తి యూనిఫారాల ఆర్డర్స్ అందజేత
- టెస్కో జీఎం అశోక్ రావు
Sircilla textile industry: మనబలగం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని టెస్కో జీఎం అశోక్ రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు అందించే యూనిఫామ్ చీరల ఆర్డర్లు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా టెస్కో జీఎం అశోక్ రావు మాట్లాడారు. ఇందిరా మహిళా శక్తి చీరల పథకంలో భాగంగా ముందుగా ఒక చీరను (అందరికీ ఒకే రంగు చీర) ఆర్డర్స్ దాదాపు 4.24 కోట్ల మీటర్లు అందజేసిందని వెల్లడించారు. ఈ చీరలను ఈ ఏప్రిల్ 30వ తేదీలోగా సిద్ధం చేయాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లతో యార్న్ బ్యాంక్ ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మార్కెట్తో పోటీపడి స్వయం సమృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆర్డర్స్ తయారు చేసేలా యంత్రాలు ఆధునీకరించాలని సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన రూ.500 కోట్ల బకాయిలు విడుదల చేసిందని తెలిపారు. ఆధునిక, నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేసేలా సిద్ధం కావాలని పేర్కొన్నారు. ఇప్పటికే స్కూల్ యూనిఫాం మరమగ్గాల సంఘాలకు 65.67 లక్షల మీటర్లు ఆర్డర్స్ ఇచ్చామని వెల్లడించారు. ఆర్డర్స్ అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చేనేత జౌళి శాఖ సెక్రటరీకి ప్రత్యేక కృతజ్ఞతలు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ బాధ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హ్యాండ్ లూమ్ అండ్ టెక్స్టైల్స్ ఏడీ సాగర్, టెస్కో ఏడీ సందీప్ జోషి పాల్గొన్నారు.
