Mouni Amavasya celebrations: ఎల్లారెడ్డిపేట, జనవరి 29 (మన బలగం): ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో మాఘమాస (మౌని అమావాస్య) పర్వదినాన్ని పురస్కరించుకొని పలు దేవాలయాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని అక్కపల్లి గ్రామంలోని బుగ్గ రాజేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లోని బుగ్గ వద్ద (నీటి ధార) భక్తులు వేకువ జామునుంచే పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం అక్కడే ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మండలకేంద్రంలోని కేశపెరుమాండ్ల గుట్ట, గొల్లపల్లిలోని గాలం గుట్ట, వెంకటాపూర్లోని ఆదిపెరుమాండ్ల దేవాలయాల్లో జరిగిన వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేటలోని కేశపెరుమాండ్ల ఆలయంలో మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వైద్యులు సత్యనారాయణ స్వామిని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు, పాక్స్ అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, నాయకులు, ఆలయకమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.