Telangana Agricultural Labor Union: కరీంనగర్, డిసెంబర్ 24 (మన బలగం): ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు కలిగిన వ్యవసాయ కూలీలందరికి ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి సంవత్సరం రూ.12 వేలు చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికలముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు భూమిలేని వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు చొప్పున ఆర్థిక భరోసా కల్పిస్తామనే ప్రకటించిన పథకానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. తొలి విడుత రూ.6 వేలు మరొక విడుత రూ.6 వేలు చెల్లింపులు కాకుండా ఒకే సారి రూ.12 వేలు చెల్లించాలని, తొలి విడతలో వందరోజులు ఉపాధిహామీ పనులు పూర్తి చేసిన వారికి ఇవ్వాలని ఆలోచించడం సరైంది కాదని, కొన్ని గ్రామాల్లో జాబ్ కార్డులు కలిగిన కూలలీలందరికి వంద రోజులు పని కల్పించలేని పరిస్థితులు ఉన్నాయని అన్నారు. కొన్ని అనివార్య పరిస్థితితుల్లో కూలీలు పనికి పోకుండా ఉన్నారని, దీనివల్ల వారికి నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధిహామీ కూలీలకు 100 రోజుల పని దినాలు కాకుండా 200 రోజులు పని కల్పించే విధంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని, తద్వారానే మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం జాబ్కార్డు కలిగిన వ్యవసాయ కూలీలు, చిన్న సన్న కారు రైతులందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని క్షేత్ర స్థాయిలో ఉపాధి హామీ పనులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న ప్రతి ఒక్క వ్యవసాయ కూలీని పరిగణలోకి తీసుకొని ఎలాంటి షరతులు లేకుండా వ్యవసాయ కూలీలందరికి ఈ పథకాన్ని వర్తింప చేయాలని సృజన్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.