Inter Board Commissioner: నిర్మల్, ఫిబ్రవరి 19 (మన బలగం): యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు సమీకృత గురుకుల పాఠశాలకు అవసరమైన స్థలాల సేకరణ త్వరితగతిన పూర్తిచేయాలని సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్ మీడియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. సమీకృత గురుకుల పాఠశాల (యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్) స్థల సేకరణపై సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్ మీడియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణా ఆదిత్య బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ముందుగా ఆదిలాబాద్ కలెక్టరేట్కు చేరుకున్న కమిషనర్కు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్తో పాటు, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ దీపక్ తివారీ పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్లో ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, ప్రభుత్వం నూతనంగా నిర్మించతలపెట్టిన సమీకృత రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, వసతి గృహ సముదాయం కోసం స్థల సేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆదిలాబాద్ గ్రామీణ మండలం నిషాన్ ఘాట్లో స్థలాన్ని కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో ఈ ప్రాంతాన్ని సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, ఇప్పటికే జిల్లాలో సమీకృత రెసిడెన్షియల్ పాఠశాల భవనం నిర్మాణం కోసం అనువైన స్థలాన్ని గుర్తించడం జరిగిందని తెలిపారు. దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ సమీపంలో అనువైన స్థలాన్ని గుర్తించామని తెలిపారు. సమీకృత రెసిడెన్షియల్ పాఠశాల భవనం నిర్మాణం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.