Jagityal Collector: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బి.సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను కోరారు. జగిత్యాల జిల్లా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని, ఎర్దండి, కోమటి కొండాపూర్, మూలరాంపూర్ గ్రామాల్లోని గోదావరి నది, పరివాహక ప్రాంతాలను, ములరాంపుర్ శివారులోని బ్యారేజీని, చెరువులు, వాగులు, కుంటలను జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్తో కలిసి సందర్శించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున, పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని తెలిపారు. కార్యక్రమంలో మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం తహసీల్దార్ ప్రసాద్, పోలీస్ శాఖ, వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.