Dharmabiksham Jayanti: కరీంనగర్, మార్చి 26 (మన బలగం): స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మాజీ నల్లగొండ పార్లమెంటు సభ్యులు ధర్మబిక్షం జయంతి, వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, ట్యాంక్ బండ్పై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం బద్దం ఎల్లారెడ్డి భవన్లో ధర్మబిక్షం చిత్రపటానికి పూలమాలవేసి 14వ వర్ధంతి కార్యక్రమాన్ని సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజు గౌడ్ మాట్లాడుతూ దున్నే వానికి భూమితో పాటు గీసే వాడికే చెట్టు నినాదం ఇచ్చి గీత కార్మికుల సంక్షేమానికి కృషి చేసిన మహనీయుడు ధర్మబిక్షం అని తెలిపారు.
గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆనాడు కార్మికులందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి గీతా పనివారల సంఘాన్ని ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలపై పోరాడి వారి హక్కులను సాధించిన గొప్ప నాయకుడని కొనియాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు చివరి శ్వాస వరకు ప్రజల అభ్యున్నతి కోసం నిర్విరామంగా కృషి చేసి భవిష్యత్ తరాలకు గొప్ప మార్గదర్శిగా నిలిచిన మహనీయుడు ధర్మ బిక్షం అని అన్నారు. హైదరాబాదులో రెడ్డి హాస్టల్ ప్రేరణతో సూర్యాపేట కేంద్రంగా తెలుగు భాష విద్య ప్రాథమిక అవసరాన్ని గుర్తించి చాలామంది విద్యారంగానికి ఆకర్షించే విధంగా సూర్యపేట కేంద్రంగా హాస్టల్ నెలకొల్పి ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పిన గొప్ప వ్యక్తి ధర్మబిక్షం అని పేర్కొన్నారు. ధర్మబిక్షం ఆశయ సాధన కోసం నేటి యువత పోరాటాలకు సిద్ధం కావాలని కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజుగౌడ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి సీపీఐ జిల్లాకౌన్సిల్ సభ్యులు న్యాలపట్ల రాజు నాయకులు రామారావు వెంకటేశ్, హేమంత్, రాము, తురక సురేందర్ రెడ్డి, ఏం రాజు మహేష్, సందీప్, అజయ్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.