BKMU: కరీంనగర్, మార్చి 26 (మన బలగం): ఉపాధి హామీ కూలీలు రోజు వారి పనికి సరైన కూలి రావడం లేదని, శ్రమ దోపిడీకి గురవుతున్నారని, రోజు వారి కూలి రూ.600 ఇవ్వాలని బీకేఎంయూ రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం కరీంనగర్ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బడుగు బలహీన వర్గాలకు చేతినిండా పని కల్పించి వారిని ఆర్థికంగా ఆడుకువాలనే ఉపాధి హామీ పథకం లక్ష్యం నెరవేరడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయంపులు పెంచాలని, జాబ్కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి పని కల్పించాలని డిమాండ్ చేశారు. కూలీలకు కొలుతలు పెట్టి పని చేయించడం ద్వారా పని ప్రేదేశాల్లో భూములు గట్టి పడడం వల్ల రోజు వారి కూలి కేవలం వంద రూపాయలు పడుతున్నాయని, దీంతో కూలీలు శ్రమ దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొలతలు నిబంధన లేకుండా ప్రతి రోజూ కూలి రూ.600 చెల్లించాలని, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ సౌకర్యం, ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. పని ప్రదేశం కిలో మీటర్ దూరం దాటితే రవాణా సౌకర్యం కల్పించాలని, పార, గడ్డ పార పదును వేయడానికి డబ్బులు చెల్లించాలని, 200 రోజులు పని కల్పించాలని, ఉపాధి కూలీలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, పని గ్యారంటీ చట్టాన్ని అమలు చేయాలని సృజన్ కుమార్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నల్లగొండ శ్రీనివాస్, రాజయ్య, మల్లేశం, రజిత, కవిత, రాజేశ్వరి, విజయ, కనుకవ్వ, లక్ష్మి, శోభరాణి తదితరులు పాల్గొన్నారు.