- మామూళ్ల జాబితాలో కొత్తగా చేరిన బార్లు
- ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ ఆదేశాలంట
bars: జగిత్యాల ప్రతినిధి, మార్చి 23 (మన బలగం): జగిత్యాల జిల్లాలోని బార్ ఆండ్ రెస్టారెంట్ నిర్వాహకులకు కొత్త చిక్కొచ్చిపడింది. ఇదివరకు ఆహార కల్తీ నిరోధక శాఖకు మామూళ్లు ఇచ్చిన దాఖాలాలు లేకపోగా కొత్తగా మామూళ్లు ఇవ్వాలంటూ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ నుంచి భార్ల నిర్వాహకులకు అనధికార ఆదేశాలు అందినట్లు తెలిసింది. ఒక్కో బార్ నిర్వాకుడు ప్రతి ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని, లేకుంటే తనిఖీలను నిర్వహించి కేసులు, జరిమానాలను ఫేస్ చేయాలని పరోక్షంగా హెచ్చరించినట్లు తెలిసింది. ఇప్పటికే బెల్టు షాపుల దెబ్బలకు బార్ ఆండ్ రెస్టారెంట్లకు వచ్చే కస్టమర్ల సంఖ్య తగ్గిపోతుండడం తెలిసిందే. వస్తున్న నష్టాలను ఎలా భర్తీ చేసుకోవాలా అన్న సందేహంలో ఉన్న బార్ ఆండ్ రెస్టారెంట్ల నిర్వాహకులకు మామూళ్ళ ముచ్చటలో పట్టమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్న చందంగా మారిందని కొందరు బార్ల నిర్వాహకులు అంటున్నారు. జగిత్యాల జిల్లాలో దాదాపుగా 20 వరకు బార్ ఆండ్ రెస్టారెంట్లు ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఒక్కో బార్ నిర్వాహకుడి నుంచి 12 వేల లెక్కన వసూళ్లకు దిగితే ఒక్క బార్ల నుంచే ఏటా దాదాపుగా రెండున్నర లక్షల చేరుతాయన్నట్లు చర్చించుకొంటున్నారు. ఇలా కొత్తగా బార్ల నిర్వాహకులకు మామూళ్ళ బరువు పడితే మరో రకంగా ఆయా భార్లకు వెళ్లే మందు బాబుల జేబులకు చిల్లేనన్నట్లు చర్చించుకొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరుల కోసం బార్ ఆండ్ రెస్టారెంట్ల కు ప్రభుత్వం అనుమతులు ఇచ్చి వచ్చే ఆదాయం తో ప్రజా సంక్షేమాని వినియోగిస్తుంటే అదే ప్రభుత్వం విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు ప్రజా ప్రయోజనాలను మరచి స్వంత లాభాలకు పోవడం సరికాదని పలువురు అంటున్నారు. ఇప్పటికే పలు విభాగాల నుంచి భార్ల నిర్వాహకులకు మామూళ్ళ బెడద ఉండగా కొత్తగా ఆహార కల్తీ నిరోధక శాఖ రూపంలో బార్లపై వార్ తప్పదేమో.