Uttam Kumar Reddy: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 4 (మన బలగం): రేషన్ షాపులకు సన్న బియ్యం రవాణా & పంపిణీ వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్న బియ్యం సరఫరా పై రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి లతో కలిసి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 40 రూపాయలు పైగా కిలో బియ్యానికి వెచ్చించి ప్రజలకు ఉచితంగా సరఫరా చేశామని, చాలా పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేసి ప్రజలకు బియ్యం సరఫరా చేస్తున్నప్పటికీ 70 నుంచి 80% వరకు ఆ బియ్యాన్ని ప్రజలు తినేవారు కాదని, రీసైక్లింగ్ ద్వారా కోళ్ల ఫారాలకు, ఇతర అవసరాలకు తరలి వెళ్లేదని మంత్రి తెలిపారు.
మన రాష్ట్రంలో అత్యధిక జనాభా దొడ్డు బియ్యం తినడం ఆపేసారని, దీనిని గమనించి రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం 84 శాతం జనాభాకు ఉచితంగా సరఫరా చేసే కార్యక్రమం చేపట్టామని అన్నారు. సన్న బియ్యం సరఫరా పంపిణీ విజయవంతం అవుతుందని, పేదలు, ప్రజలు సన్న బియ్యం సంతోషంతో స్వీకరిస్తున్నారని, 84 శాతం జనాభా ఆహార భద్రతకు సుస్థిరత ఏర్పడిందని అన్నారు. రేషన్ షాపులకు సన్న బియ్యం సరఫరా రవాణా వేగవంతం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. రవాణా కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి సన్న బియ్యం రవాణా పై కలెక్టర్ లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ఏప్రిల్ 6న శ్రీరాం నవమి సందర్భంగా సీఎం భద్రాచలం వస్తారని, సన్న బియ్యం స్వీకరించిన దళిత గిరిజన కుటుంబాలతో కలిసి భోజనం చేస్తారని మంత్రి తెలిపారు. జిల్లా స్థాయిలో సైతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పేదలతో కలిసి ప్రభుత్వం సరఫరా చేస్తున్న సన్న బియ్యంతో భోజనం చేయాలని మంత్రి సూచించారు.ఈ కార్యక్రమానికి అవసరమైన మీడియా కవరేజ్ ఉండేలా చూడాలని మంత్రి తెలిపారు. 13 వేల కోట్లు ఖర్చు చేసి 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చూడాలని అన్నారు. సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, సన్న బియ్యం సరఫరా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా ప్రారంభించడం జరిగిందని, దీనికి కృషి చేసిన అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు. సన్న బియ్యం పంపిణీ కారణంగా రేషన్ షాపుల వద్ద ఒకేసారి డిమాండ్ పెరిగి పోతున్నందున బియ్యం రవాణా వేగవంతం చేయాలని, రేషన్ షాపుల వద్ద అవసరమైన మేర బియ్యం అందుబాటులో పెట్టాలని అన్నారు. సన్న రకం బియ్యం సరఫరా పై ప్రభుత్వ చిత్తశుద్ధి చాటేలా ప్రచారం కల్పించాలని అన్నారు. పేదల ఇంటికి సన్న బియ్యం సరఫరా అతి గొప్ప విజయమని అన్నారు.నూతన రేషన్ కార్డుల దరఖాస్తుల స్క్రూటిని వేగవంతం చేయాలని అన్నారు.
3275 మెట్రిక్ టన్నుల పంపిణీ
జిల్లాలో మొత్తం 345 రేషన్ దుకాణాలు ఉన్నాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. మొత్తం 1,73,578 రేషన్ కార్డులు ఉండగా, 5,02,714 మంది లబ్ధిదారులు ఉన్నారని
వివరించారు. వీరందరికీ మొత్తం 3275 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. బియ్యం పంపిణీ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి వసంత లక్ష్మి, డీఎం రజిత తదితరులు పాల్గొన్నారు.