CPI Anniversary Celebrations: కరీంగనర్, డిసెంబర్ 26 (మన బలగం): ప్రజా ఉద్యమాలే సీపీఐకి ఆయుధమని, మనిషిని మనిషి దోపిడీ చేయని సమసమాజ నిర్మాణం కోసం ఆవిర్భవించిన సీపీఐ నాటి నుంచి నేటివరకు ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దుదూ ప్రశ్నించే తత్వాన్ని నేర్పిందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి తెలిపారు. సీపీఐ 100వ ఆవిర్భావ వార్నికోత్సవాల సందర్భంగా కరీంనగర్ మండలంలోని గుంటూరు పల్లె గ్రామాల్లో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను సాయి వేణి రాయమల్లు, బొమ్మకల్ చౌరస్తా (కాల్వ నరసయ్య విగ్రహం వద్ద) ఏర్పాటు చేసిన జెండాను కాల్వ శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కసిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లడుతూ కార్మిక, కర్షక, ప్రజల కోసం, ప్రజా హక్కుల కోసం రాజీలేని పోరాటాలు చేసే సత్తా కమ్యూనిస్టులకే ఉంది అని అన్నారు. దేశ స్వాతంత్ర్య కోసం, పాలక వర్గాల ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతర ఉద్యమాలతో ప్రజా చైతన్యాన్ని రగిలించిన పార్టీ సీపీఐ ఎన్నో త్యాగాలు చేస్తూ బ్రిటీష్ కాలం నుంచి సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉండేందుకు ఏర్పడిందని స్పష్టం చేశారు.
అప్పటి రజాకార్ల, భూస్వాముల, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి దొరలను, దేశ్ముఖ్లను తరిమికొట్టి లక్షలాది ఎకరాల భూమిని పంచి, ‘బాంచన్ దొర, నీకాల్మోకుత’ అని బతికే బడుగు బలహీన జీవులు బందూకులు పట్టించి గెరిల్లా రైతాంగ పోరాటం నడిపించిన చరిత్ర సీపీఐది అని అన్నారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజా హక్కుల పరిష్కారమే ధ్యేయంగా ఉద్యమిస్తున్న పార్టీ సీపీఐ అన్నారు. 100 ఏండ్ల సుదీర్ఘ ప్రస్థానంలో సీపీఐ నిర్వహించిన పోరాటాలు, ఉద్యమాలతో ప్రజలకు, కార్మికవర్గానికి అనేక హక్కులు, సౌకర్యాలు సాధించి పెట్టిట్టామని, ఎందరో అమరవీరులు నేలకొరిగారని, మరెందరో ప్రజలకోసం తమ జీవితాలను త్యాగం చేశారని వారి ఆశయాలను సాధించేందుకు పార్టీ శ్రేణులు అనునిత్యం శ్రమించాలని కోరారు. ఉద్యమాలు నిర్వహించి నిర్మాణపరంగా గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే విషయంలో ప్రతి కార్యకర్త కృషిమరువలేనిదన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, నలవాల సదానందం, కరీంనగర్ మండల కార్యదర్శి సాయి వేణి రాజమల్లు, బొమ్మకల్ కార్యదర్శి కాల శ్రీనివాస్ యాదవ్, తంగెళ్ల సంపత్, సదయ్య, కే సతీష్, కే కొమురయ్య, సిహెచ్ మల్లయ్య, కే నర్సయ్య, ఏం భూమయ్య తదితరులు పాల్గొన్నారు.