Nirmal Collector: నిర్మల్, జనవరి 18 (మన బలగం): ప్రభుత్వ పథకాల అమలుకై క్షేత్రస్థాయిలో పకడ్బందీగా సర్వేను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్లు, నూతన ఆహార భద్రత కార్డులు (రేషన్ కార్డులు), రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ఇప్పటికే క్షేత్రస్థాయి సర్వే ప్రారంభమైందని తెలిపారు. శనివారం రాత్రి రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో కలెక్టర్లకు పలు కీలక సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. పథకాల అమలు కోసం సర్వేలో పేర్లు రాని ప్రజలు తమ దరఖాస్తులను అందజేసేందుకై ప్రజా పాలన కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. పథకాల అమలుపై ఎటువంటి దుష్ప్రచారం చేయరాదన్నారు. పథకాల అమలు పై ప్రజలకు ఎటువంటి సందేహాలు ఉన్న ప్రజాపాలన కేంద్రాల వద్ద అధికారులు నివృత్తి చేస్తారని తెలిపారు. గ్రామీణ స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షక బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈనెల 21వ తేదీ నుంచి గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించి, పథకాల అమలు పై చర్చించి, ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. పథకాలపై సర్వే అనేది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. వేరు వేరు పథకాలపై సర్వేకు సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రజలకు ఎటువంటి సందేహాలున్న ఆయా అధికారులను సంప్రదించవచ్చునన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.