Minister Ponguleti Srinivas Reddy
Minister Ponguleti Srinivas Reddy

Minister Ponguleti Srinivas Reddy: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Minister Ponguleti Srinivas Reddy: నిర్మల్, జనవరి 18 (మన బలగం): ప్రభుత్వం నూతనంగా అమలు చేయబోవు ఇందిరమ్మ ఇండ్లు, ఆహార భద్రత కార్డులు (రేషన్ కార్డులు), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.శనివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, లబ్ధిదారులను గుర్తించేందుకై గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో క్షేత్రస్థాయి సర్వే నిర్వహించాలన్నారు. సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా పథకం వర్తిస్తుందన్నారు. ఇందుకుగాను వ్యవసాయ శాఖ అధికారులు పంటలను సాగు చేసే భూములను గుర్తించి నివేదికలను సిద్ధం చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో గ్రామ సభలు, పట్టణ ప్రాంతాల్లో వార్డు సభలు నిర్వహించి అంతిమ లబ్ధిదారుల వివరాలను వెల్లడించాలన్నారు. ఈ పథకాల అమలు నిరంతర ప్రక్రియ అని తెలిపారు.

అనంతరం మంత్రులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న పథకాల లబ్ధిదారులను పకడ్బందీగా ఎంపిక చేయాలని తెలిపారు. అర్హుల ఎంపికను ఎలాంటి తప్పిదాలు లేకుండా పూర్తి చేయాలని తెలిపారు. ఉన్నతాధికారులందరూ సర్వే తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టరేట్‌లోని సమావేశం మందిరం నుంచి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, జిల్లాలో నిర్వహిస్తున్న నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. ఈనెల 21 నుంచి గ్రామ వార్డు సభలను నిర్వహించి సమగ్ర అంతిమ లబ్ధిదారుల జాబితాను వెల్లడిస్తామని తెలిపారు. నాలుగు పథకాల ఎంపికకు సంబంధించి క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ప్రతి అధికారి ఎప్పటికప్పుడు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న సర్వేను సమీక్షించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్ లు, జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, డి సి ఎస్ ఓ కిరణ్ కుమార్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *