Chandra Rajeshwara Rao vardandti
Chandra Rajeshwara Rao vardandti

Chandra Rajeshwara Rao vardandti: గొప్ప కమ్యూనిస్టు యోధుడు చండ్ర రాజేశ్వరరావు : సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి

Chandra Rajeshwara Rao vardandti: కరీంనగర్, ఏప్రిల్ 9 (మన బలగం): దేశంలో అణగారిన వర్గాల కోసం, సమ సమాజ స్థాపన నిర్మాణం కోసం తన జీవితాన్నే ధారబోసిన గొప్ప కమ్యూనిస్టు యోధుడు చండ్ర రాజేశ్వరరావు అని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి కొనియాడారు. బుధవారం స్థానిక బద్ధం ఎల్లారెడ్డి భవన్‌లో చండ్ర రాజేశ్వరరావు 31వ వర్ధంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజేశ్వరరావు చిత్రపటానికి వెంకటస్వామి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ భూస్వామ్య కుటుంబంలో జన్మించిన రాజేశ్వరరావు ఉన్నత విద్యను అభ్యసించి కార్మిక, కర్షక, పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం భారత కమ్యూనిస్టు పార్టీలో చేరి ప్రజల కోసం పనిచేసిన నాయకుడని అన్నారు. దున్నే వాడికి భూమి కావాలని పేదలందరికీ భూమి చెందాలని భూసంస్కరణ చట్టం అమలు చేయడం కోసం ప్రజా ఉద్యమాలు నిర్మిస్తూనే మరొకవైపు కోర్టులో ఆ చట్టం కోసం పోరాటం చేసి సాధించిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి రాజేశ్వరరావు అని తెలిపారు.

తన యావదాస్తిని పేదలకు పంచాడని, ఆరు దశాబ్దాల పాటు భారత కమ్యూనిస్టు పార్టీలో పనిచేసి ఉన్నతమైన పదవులు అనుభవించి, జాతీయ ప్రధాన కార్యదర్శిగా దేశంలో అనేక ప్రజా ఉపయోగకర కార్యక్రమాలు నిర్వహించడంలో సఫలీకృతమై, నిరంతరం పేదల కోసం పరితపించిన గొప్ప మానవతావాది అని పేర్కొన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా ఆయన ప్రజలకు సేవ చేశాడని, అలాంటి రాజేశ్వరరావు మృతిచెంది 31 సంవత్సరాలు అవుతుందని తెలిపారు. రాజేశ్వరరావు ఆశయాలను, లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు నేటితరం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ప్రతిన బూని రానున్న రోజుల్లో భూమిలేని నిరుపేదలకు, దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు ఇండ్ల స్థలాల కోసం, ఇండ్ల కోసం, వ్యవసాయ భూముల కోసం పోరాటాలు నిర్వహించాలని వెంకటస్వామి పిలుపునిచ్చారు. నివాళులర్పించిన వారిలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, టేకుమల్ల సమ్మయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు, పైడిపల్లి రాజు, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, కిన్నెర మల్లవ్వ, పిట్టల సమ్మయ్య, మచ్చ రమేష్, బోనగిరి మహేందర్, కంది రవీందర్ రెడ్డి, నాయకులు సత్యనారాయణ చారి, కొట్టే అంజలి,సాంబరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *