- కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలి
- రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ.2లక్షల రుణ మాఫీ చేయాలి
- తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాంతాల శ్రీనివాస్ రెడ్డి, కంది రవీందర్ రెడ్డి
AIKS dharna: కరీంనగర్, ఏప్రిల్ 9 (మన బలగం): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ రూ.2లక్షల రుణం మాఫీ చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం(ఏఐకేఎస్) ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదట నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ పమెల సత్పతిని కలిసి రైతు సమస్యలపై వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కాంతాల శ్రీనివాస్ రెడ్డి, కంది రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసిస్తున్నట్లు తెలిపారు. తక్షణమే స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఎటువంటి షరతులు లేకుండా రూ.2 లక్షల బ్యాంకు రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
పంటల బీమా పథకం అమలు చేయాలని, మిర్చి కింటాకు 25 వేల రూపాయల ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. పత్తి కింటాకు 16 వేల రూపాయలు మద్దతు ధర కల్పించాలని, సన్న వడ్లకు ప్రభుత్వం ప్రకటించిన 500 బోనస్ను చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి రాతపూర్వకంగా ఇచ్చిన హామీ మేరకు పంటలకు కనీస మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావాలని పేర్కొన్నారు. పీఎం కిసాన్ సంబంధించిన 6000 నుంచి 18 వేలకు పెంచి అమలు చేయాలని కోరారు. వర్షాలు, వడగళ్ల వానలకు నష్టపోయిన పంటలకు నష్టపరిహారం వెంటనే చెల్లించి, రైతాంగని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ధాన్యం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించి కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం(ఏఐకేఎస్) జిల్లా గౌరవాధ్యక్షులు పొనగంటి కేదారి, జిల్లా అధ్యక్షుడు కాంతాల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కంది రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ రెడ్డి, రైతు సంఘం జిల్లా నాయకులు అందె తిరుపతి, గోలి బాపు రెడ్డి, బందేల శ్రీనివాస్, ఎం.డి.ఉస్మాన్ పాషా, భాషవేణి మహేందర్, కనుకయ్య, మల్లయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.