- కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
- 3 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యం
- 240 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
- ముస్తాబాద్ మండలంలో కొనుగోలు కేంద్రం ప్రారంభం
purchasing centers: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 8 (మన బలగం): యాసంగి (రభి) పంట కొనుగోలు లో భాగంగా మహిళా సంఘాల ద్వారా 191 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ముస్తాబాద్ మండలంలోని గూడెం, నామాపూర్, పోత్గల్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాల్లో అధికంగా మహిళా సంఘాలకు భాగస్వామ్యం కల్పించడం జరిగిందని అన్నారు. యాసంగి సీజన్ లో సిరిసిల్ల జిల్లా పరిధిలో మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యానికి గాను మహిళా సంఘాల ద్వారా 191 కొనుగోలు కేంద్రాలకు చర్యలు తీసుకుంటున్నామని, వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల ద్వారా 42, మెప్మా ద్వారా 6, డిసిఎంఎస్ ద్వారా 1 మొత్తం 240 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్వాహకులను ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. వేసవి కాలం నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. చల్లని త్రాగు నీరు, ఓఆర్ఎస్ ప్యాకేట్లు, నీడ ఉండేలా చూసుకోవాలని అన్నారు.కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన గన్ని బ్యాగులు, టార్ఫాలిన్ సంచులు, ప్యాడీ క్లీనర్, తేమ యంత్రాలు , వెయింగ్ యంత్రాలు అందుబాటులో పెట్టుకోవాలని అన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తలారి రాణి, డీఆర్డీఓ శేషాద్రి, పౌర సరఫరాల అధికారి వసంత లక్ష్మి, పౌర సరఫరాల మేనేజర్ రజిత, తహశీల్దార్ సురేష్, ఎంపీడీఓ బీరయ్య, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.