MLA Adluri Laxman Kumar: సారంగాపూర్, జనవరి 2 (మన బలగం): సారంగాపూర్ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్ట్ను గురువారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇరిగేషన్ అధికారులు, ఫారెస్ట్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం చిల్వకొడూరు, జైన లిఫ్ట్లను పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదావరి లిఫ్ట్పై ఆధారపడి సుమారు 15 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు సాగుచేస్తున్నట్లు తెలిపారు. కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా గోదావరిలో నీరు లేకపోవడంతో సాగుకు ఇబ్బంది కలుగుతోందని, రైతులు తన దృష్టికి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఈ మేరకు రోళ్లవాగును, లిఫ్ట్ను పరిశీలించినట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఒక టీఎంసీ నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇరిగేషన్ అధికారులు, ఫారెస్ట్ అధికారులు, కాంట్రాక్టర్ మధ్య సమన్వయం లేకపోవడంతో సమస్య ఏర్పడిందని తెలిపారు. గత ప్రభుత్వ పాలకులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రూ.60 కోట్లతో ప్రాజెక్ట్ను ప్రారంభించి దాన్ని రూ.140 కోట్లకు తీసుకెళ్లి రోళ్ల వాగును మరో కాళేశ్వరం ప్రాజెక్ట్లా మార్చి అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. కమీషన్లకు ఆశపడి రీడిజైనింగ్ పేరుతో డబ్బులు దోచుకోవడానికి తప్ప ఈ ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించాలన్న ఉద్దేశం గత ప్రభుత్వ పాలకులకు లేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. రోళ్ల వాగు ప్రాజెక్ట్కు సంబంధించిన కాంట్రాక్టర్, జిల్లా కలెక్టర్తో మాట్లాడి త్వరలోనే ప్రాజెక్టును పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏప్రిల్, మే నెలలో వచ్చే పరిస్థితి జనవరి మొదటి వారంలోనే మనకు ఎదురైందన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా రోళ్ల వాగు ప్రాజెక్ట్ నుంచి తాత్కాలిక ప్రాతిపదికన నీరు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతుకు తదితరులు పాల్గొన్నారు.