- గద్దర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి
- ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలి ఉల్లా ఖాద్రి, ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర
AIYF: కరీంనగర్, జనవరి (మన బలగం): కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రజా యుద్ధ నౌక గద్దర్ను అవమానించేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలను బండి సంజయ్ వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు, వలి ఉల్లా ఖాద్రి, ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం బద్ధం ఎల్లారెడ్డి భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రి, ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ సాహిత్య కళారూపం ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలకంగా ప్రజలను చైతన్య పరుస్తూ పోరాడిన యుద్ధ నౌక గద్దర్పై అర్థరహితంగా బండి సంజయ్ మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. బీజేపీ నేతలను హత్య చేయించిన గద్దర్కు అవార్డ్ ఇవ్వాలా అంటూ నిరాధార ఆరోపణలు చేస్తూ మీడియా సాక్షిగా మాట్లాడిన సంజయ్ కేంద్ర మంత్రిగా ఉంటూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారన్నారు. బీజేపీ చరిత్ర దేశ ప్రజలకు స్పష్టంగా తెలుసని, గాంధీని చంపిన గాడ్సేది బీజేపీ, ఆర్ఎస్ఎస్ కాదా అని వారు ప్రశ్నించారు. వాస్తవానికి బీజేపీది హత్యారాజకీయాల చరిత్ర అని విమర్శించారు. దేశంలో హిందూత్వం పేరుతో అణగారిన వర్గాల ప్రజలను గుజరాత్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాలలో మారణహోమం చేసిన బీజేపీ ఈ దేశానికి ప్రమాదమని వారు ఉద్ఘాటించారు. దేశ స్వాతంత్ర్యంలో బీజేపీ పాత్రే లేదని, దేశంలో జరిగిన ఏ పోరాటంలో బీజేపీ పాత్ర లేకున్నా చరిత్రను వక్రీకరించడంలో బీజేపీ నీచ రాజకీయాలు చేస్తూ దేశంలో మత అజెండాతో అవలంబిస్తున్నారని అన్నారు. అందుకే బండి సంజయ్ బహిరంగంగా తన మాటలను వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్, రాష్ట్ర సమితి సభ్యులు భోనగిరి మహేందర్, ఏఐవైఎఫ్ కరీంనగర్ జిల్లా కన్వీనర్ లంకదాసరి కళ్యాణ్ నాయకులు సురేశ్, రాజు తదితరులు పాల్గొన్నారు.