Gram Sabha: ముధోల్, జనవరి 23 (మన బలగం): ముధోల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామసభను నామమాత్రంగా ముగిం చేశారు. గురువారం ఏర్పాటు చేసిన గ్రామసభలో తహసీల్దార్ శ్రీకాంత్ రేషన్ కార్డుల అర్హులైన జాబితాను చదివి వినిపించారు. రైతు ఆత్మీయ భరోసా, రైతు భరోసా అర్హులైన జాబితాను వ్యవసాయ విస్తీర్ణ అధికారి సందేశ్ గ్రామసభలో చదివి వినిపించారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారుల ఎంపికను ఎంపీడీవో శివకుమార్ జాబితాను వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రామసభలో గ్రామస్తులు హాజరై అర్హులైన వారికి సంక్షేమ పథకాలలో పేర్లు లేకపోవడంతో తీవ్ర అయోమయానికి గురయ్యారు. ప్రభుత్వం ఇండ్లు లేని వారికి ఇండ్లను పంపిణీ చేస్తామని చెప్పి జాబితాలో పేర్లు లేకపోవడంతో ఆవేదనకు గురయ్యారు. గ్రామసభలో ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల లబ్ధి కోసమే గ్రామసభలను ప్రభుత్వం నిర్వహిస్తోందని బీజేపీ నాయకులు మండిపడ్డారు. రేషన్ కార్డుల కోసం పడిగాపులు కాస్తున్న లబ్ధిదారుల పేర్లు రాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి న్యాయం చేయాలని గ్రామస్తులు ఆరోపించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు నాయకులు తదితరులున్నారు.