- అంగన్వాడీ విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు
- ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల తనిఖీ
Collector Sandeep Kumar Jha: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 7 (మన బలగం): అంగన్వాడీ కేంద్రాల్లో చదివే ప్రతి చిన్నారికి కంటి వైద్య పరీక్షలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా బ్లైండ్ నెస్ ప్రివెన్షన్ వీక్ అందత్వ నివారణ వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లోని 6 నెలల నుంచి 6 ఏండ్లలోపు పిల్లలందరికీ కంటి వైద్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని తంగళ్లపల్లి మండలంలోని బస్వాపూర్లో సోమవారం ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథిగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై ప్రారంభించారు. వైద్య పరీక్షలు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని అంగన్వాడి కేంద్రాల్లోని విద్యార్థులకు ప్రణాళిక ప్రకారం కంటి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఏమైనా లోపాలు గుర్తించిన పిల్లలకు మందులు అందజేయాలని సూచించారు. ఎక్కువ ఇబ్బంది పడే విద్యార్థులకు ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం అందించాలని తెలిపారు.
రిజిస్టర్ల పరిశీలన
తంగళ్లపల్లి మండలంలోని బస్వాపూర్ లోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతం, పాఠాలు బోధిస్తున్న తీరు, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును పరిశీలించారు. కార్యక్రమాల్లో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా వైద్యాధికారి రజిత, వైద్యులు నయీమాజహా, సంపత్, ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
