వేములవాడ రూరల్, చందుర్తి మండలాల్లో ఆకస్మిక తనిఖీ
Rythu Bharosa: మనబలగం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసాకు సంబంధించిన జాబితా నుంచి వ్యవసాయ యోగ్యం కాని భూములను తొలగించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి, చందుర్తి మండలం జోగాపూర్, వేములవాడ పట్టణంలోని 28, 29 వార్డులు, కోనరావుపేట మండలం ధర్మారంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు, నూతన రేషన్ కార్డుల జారీకి కొనసాగుతున్న సర్వేను అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు, నూతన రేషన్ కార్డుల జారీకి కొనసాగుతున్న సర్వే పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులను గుర్తించి, వారికి ఆయా పథకాలు అందించాలని సూచించారు. జిల్లా పశు వైద్యాధికారి, మండల ప్రత్యేక అధికారి రవీందర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ శ్రీనివాస్, వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్ , చందుర్తి తహసీల్దార్లు సుజాత, శ్రీనివాస్, విజయ్ ప్రకాష్ రావు, మహేష్, చందుర్తి, ఎంపీడీఓ ప్రదీప్, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ పాల్గొన్నారు.