- 20 ఏండ్ల నమ్మకాన్ని సొమ్ము చేసుకుని పరారీ
- మెట్పల్లిలో ఘటన
- లబోదిబో మంటున్న బాధితులు
Scam : జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో జువెల్లరీ మార్కెట్లో అతనొక బ్రాండ్. వృత్తి నైపుణ్యంలో పనోడు.. వ్యాపారంలో నమ్మకస్తుడు. తెలిసినోళ్లందరికీ చాల మంచోడు.. కానీ.. ఇప్పుడు ఆయన్ని నమ్మినోళ్లందరికీ దాదాపు రూ.20 కోట్ల విలువైన కుచ్చుటోపీ పెట్టి కుటుంబంతో సహా ఉడాయించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విడతల వారీగా అతనికి నగదు, నగల రూపంలో సొమ్మును ఇచ్చినోళ్లందరికీ ఐపీ నోటీసులు వస్తుండడంతో లబోదిబోమంటున్నారు. ఈ నెల మొదటి వారం నుంచే జువెల్లరీ షో రూం మూసి ఉండడాన్ని గమనించినా ఏదో పనుండి తీయలేదేమోని అనుమానపడ్డా అదే నిజమైంది. అరె నాంపల్లి కిష్టయ్యనా.? మంచోడే కదా.!? హా..ఔను.. మంచోడే.. ఇప్పుడు దాదాపు రూ.20 కోట్లకు ముంచి పత్తాకులేకుండా పరారీలో ఉన్నాడు. అంటూ మెట్పల్లి పట్టణంలో చర్చనీయాంశమైంది.
ఇరవై ఏళ్లుగా సుపరిచితుడు
స్వతహాగా మంచి పనోడని పేరుతెచ్చుకున్న నాంపల్లి కిష్టయ్య ఇరవై ఏళ్ల నుంచి మెట్పల్లి పట్టణ ప్రజలకే కాకుండా మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి మండలాల్లోని 50, 60 గ్రామాల్లో అతనికంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీంతో శుభకార్యాలకు నగలు చేయించుకునేందుకు వచ్చేవారు. అలా పరిచయాలు పెంచుకుని మెయిన్ బజార్లో షోరూం పెట్టుకునేంతగా ఎదిగారు.
రూ.10 కోట్లు ఆభరణాలు చేయుమనిచ్చినవే
ఈ క్రమంలో అతనిపై ఉన్న నమ్మకంతో సరిగ్గా పెళ్లిళ్ల సీజన్కు కొద్దిరోజుల ముందే చుట్టుపక్కల గ్రామాల పరిచయస్తులు శుభకార్యాల కోసం రూ.10 కోట్లకు పైగా బంగారాన్ని ఇచ్చినట్టు బాధితులు లబోదిబోమంటున్నారు. ఇందులో కాయకష్టం చేసుకుని దాచుకున్న డబ్బులను ఆభరణాలు చేయించుకుందామని ఇచ్చినవి కాగా.. మిగిలిన సొమ్ము తమ ఇంటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం చేయుమని ఇచ్చినవని కళ్లనీళ్లపర్యంతమవుతున్నారు.
పెరుగుతున్న బంగారంపై పెట్టుబడి కోసం
మరి కొందరు పెద్దమనుషులు ఇటీవల కాలంలో బంగారం కొనుగోలు కోసం ఇచ్చారంట. రోజురోజుకు ధరలు అంతకంతకూ పెరిగిపోతుండడంతో ఆశపడ్డ పెద్దమనుషులు కిష్టయ్య చేతిలో సుమారు రూ.7 నుంచి 8 కోట్ల వరకు అప్పజెప్పి బంగారం కొనుమనిచ్చినవని చర్చించుకుంటున్నారు. ఇంకొందరు ఎలాగూ సీజన్ ఉంది కదాని బిజినెస్ కోసం మరో రూ.3 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసినట్టు మాట్లాడుకుంటున్నారు.
ఓటేశాడు.. టోపీ వేశాడు
అటు పెళ్లిళ్ల సీజన్ చివరి టైం.. ఇటు ఎన్నికల సీజన్ పీక్ టైం.. ఎవరి హడావుడిలో వాళ్లున్న అదునుచూసుకుని.. షోరూంను మూసేసి.. మూటా ముల్లె సర్దేసుకుని కుటుంబంతో సహా ఉడాయించాడు. ఐపీ నోటీసులు చేతికొచ్చేదాక బయటకు పొక్కలేదంటే అతనిపై నమ్మకమే కారణమంటున్నారు. ఎన్నికల్లో ఓటేసిండు.. మా నమ్మకాలపై టోపేసిండని నోటీసులు అందుకున్న బాధితులు అగ్గిమీద గుగ్గిలమే అవుతున్నారు.
నిండా ముంచడానికి కొడుకులే కారణమా?
రెండు దశాబ్దాల కాలంగా తాను సృష్టించుకున్న మంచి తనపు కోట సత్తెనాస్ కావడానికి నాంపల్లి కిష్టయ్య కొడుకులిద్దరూ కారణమయ్యుంటారన్న ప్రచారం జరుగుతోంది. ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న కిష్టయ్య పరపతి కొడుకులిద్దరూ అప్రయోజకులు కావడమేనంటున్నారు. విచ్చలవిడిగా తిరగడం.. విలాసాలకు అలవాటుపడి.. తామ జల్సాలకు విపరీతంగా ఖర్చులు చేయడం వల్లే ఈ జనాలను ముంచే కాన్సెప్ట్కు బీజం పడిందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. తమ షోరూంకు నగలు.. ఆభరణాలు చేయుమని.. పెరుగుతున్న బంగారంపై పెట్టుబడి పెట్టిన సొమ్మును సమూలంగా ముల్లె గట్టుకుని ఉడాయిద్దామని కొడుకుల పథకం ప్రకారం ఇదంతా జరిగి ఉంటుందని బాధితులు భావిస్తున్నారు.
డబ్బులు, బంగారం ఇచ్చినోళ్లతో ప్రాణహాని
పెళ్లిళ్లకు నగలు.. ఆభరణాలు చేయుమని.. బంగారం కొనుగోలు చేయుమని ఇన్వెస్ట్ చేసినవాళ్ల నుంచి తనకు ప్రాణహాని ఉందని అడ్వకేట్ ద్వారా వచ్చిన ఐపీ-నోటీసుల్లో పేర్కొన్నారు. అది చూసిన వాళ్లందరూ పది పదిహేను రోజుల నుంచి షోరూంకు వచ్చి చూసుకుంటూ పోయే వాళ్లందరూ తెలిసిన వాళ్లందరిని అడగడం మొదలుపెట్టారు. ఇంటోళ్లందరి ఫోన్లు స్విచ్చాఫ్ రావడంతో అనుమానాలు బలపడ్డాయి. విడతలవారీగా నోటీసులు వస్తుండడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. కలవరపడుతున్నవాళ్లందరూ వకీల్ల దగ్గరికి.. పోలీసు స్టేషన్లలోకి లబోదిబోమంటూ వెళుతుండడం కలకలంరేపుతోంది.
ఐపీ పెడితే అంతా అయిపోయినట్టు కాదు
ఎవరైనా ఐపీ పెడితే అంతా అయిపోయినట్టు కాదు. ఎవరూ బెంబేలెత్తి పోవాల్సిన అవసరం అస్సలు లేదంటున్నారు న్యాయనిపుణులు. ఐపీ అంటే ‘ఇన్ సాల్వెన్నీ పిటిషన్’ అని అర్థం. అంటే దివాళా తీయడం అన్నట్టు. అంటే.. వ్యక్తి గానీ.. కంపెనీ గానీ.. తీవ్ర నష్టాల్లో కూరుకుపోయి దివాళా తీస్తే.. తమకు అప్పులిచ్చిన వారికి.. పెట్టుబడులు పెట్టిన వారికి.. వారి చిరునామాకు కోర్టు ద్వారా పంపే నోటీసులనే ఐపీ నోటీసులు అంటారు. అలా వచ్చిన వెంటనే కంగారు పడకుండా తాము ఇంకో అడ్వకేటును సంప్రదించి తమకు నోటీసులు ఇచ్చిన వాళ్లు నిజంగా దివాళా తీశారా.? లేదా.? దివాళా తీసినట్టు డ్రామాలుడుతున్నారాన్న విషయాన్ని బాధితులు నిరూపిస్తే.. ఐపీ నోటీసులను డిస్మిస్ చేసే అధికారం కోర్టుకు ఉంటుందంటున్నారు. ఒకవేళ నిజంగానే దివాళా తీస్తే..1920లో రూపొందించిన ఈ బ్రిటిష్ కాలంనాటి చట్టం ప్రకారం దివాళా తీసిన వారు తాము ఏవిధంగా నష్టపోయామో.. స్థిర, చరాస్తుల వివరాలు, తగు ఆధారాలతో సహా కోర్టులో నిరూపించుకోవాల్సి ఉంటుంది.
ఏదిఏమైనా జగిత్యాల జిల్లాలో ప్రజల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటూ ఐపీ నోటీసుల కవచాన్ని అడ్డంపెట్టుకుని ఉడాయిస్తున్నవారు రోజు రోజుకూ పెరిగిపోతున్నారు.