- రోడ్డు భద్రత ప్రమాణాలపై విస్తృత ప్రచారం కల్పించాలి
- జిల్లా కేంద్రాల్లో రోడ్డు భద్రతా ప్రమాణాలపై భారీ ర్యాలీ
- గురుకులాలో పిల్లలకు అందించే ఆహార నాణ్యతపై తనిఖీలు నిర్వహించాలి
- జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి పొన్నం ప్రభాకర్
Minister Ponnam Prabhakar: మనబలగం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత ప్రమాణాలపై అవగాహన కల్పించేలా రోడ్డు భద్రత మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి రోడ్లు భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ తో కలిసి పొన్నం ప్రభాకర్ రోడ్డు భద్రత మాసోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, గతంలో కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించేదని, దీని ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని నేడు రొడ్డు భద్రతా మాసోత్సవం చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి శాఖను భాగస్వామ్యం చేస్తూ వినూత్నంగా ప్రజలకు చేరేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రోడ్డు భద్రత ప్రమాణాలపై కార్యక్రమాలు ప్రతి గ్రామంలో జరగాలని అన్నారు. పిల్లల్లో రొడ్డు భద్రతా ప్రమాణాల పై అవగాహన కల్పించేందుకు ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత విద్యార్థులచే ప్రతి జిల్లా , మండల హెడ్ క్వార్టర్ లో భారీ ర్యాలీ చేపట్టాలని సూచించారు. ఆర్& బీ, పంచాయతీ రాజ్ శాఖ తమ పరిధిలో రోడ్డు భద్రతా ప్రమాణాలపై కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. రవాణా శాఖ, పోలీస్ శాఖ, విద్యాశాఖ, రోడ్లు భవనాల శాఖ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రోడ్డు భద్రత కార్యక్రమాలు విజయవంతం చేయాలని అన్నారు.
భారీ తుఫాన్లు, వరదలు, రోగాల వల్ల పోయే ప్రాణాల కంటే ప్రమాదాల్లో అధికంగా ప్రాణాలు కోల్పోతున్నామని, రొడ్డు ప్రమాదాల నియంత్రణకు మనమంతా కలిసి పని చేయాలని అన్నారు. భద్రతా ప్రమాణాలను పిల్లల సిలబస్ లో కూడా చేర్చే విధంగా చూస్తామని అన్నారు. రోడ్డు భద్రత నియమాలను పాటించని వారి లైసెన్స్ రద్దు చేసి భవిష్యత్తులో జారీ చేసేందుకు వీలు లేకుండా సాఫ్ట్ వేర్ రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని అన్నారు. రోడ్డు భద్రత ప్రమాణాల కార్యక్రమాలకు విస్తృత ప్రచారం ఉండాలని, స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని అన్నారు. రోడ్డు భద్రత ప్రమాణాల అవగాహన కార్యక్రమాల్లో హెల్మెట్ వినియోగం వల్ల కలిగే లాభాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ వినియోగించేలా ప్రోత్సహిస్తూ కొంతమందికి హెల్మెట్ పంపిణీ చేయాలని, ఈ కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిన మార్గాలలో బస్సులు పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. రవాణా శాఖ అధికారులు దొడ్డు భద్రతా కార్యక్రమాలను ముందుండి నిర్వహించాలని, పాఠశాలలో రోడ్డు భద్రత ప్రమాణాలపై పోటీ పరీక్షలు నిర్వహించాలని అన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలో పిల్లలకు మెస్ చార్జీలు పెంచామని, వారికి రుచికరమైన నాణ్యమైన ఆహారం అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పిల్లలకు అందించే ఆహర నాణ్యతను కలెక్టర్లు , ఉన్నతాధికారులు తనిఖీ చేయాలని, ఆహర సరఫరా చేసే కాంట్రాక్టర్లకు బిల్లులు త్వరగా చెల్లిస్తున్నామని , నాణ్యత అంశంలో ఎక్కడ రాజీపడవద్దని సూచించారు.
రోడ్డు భవనాల శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ మాట్లాడుతూ, జనవరి నెల మొత్తం రోడ్డు భద్రత ప్రమాణాల కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు తెలిపారు. ప్రస్తుత సమాజంలో జరిగే రొడ్డు ప్రమాదాలలో 75% డ్రైవర్ తప్పుల వల్ల జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలోని వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత ప్రమాణాలు, పాటించాల్సిన నియమ నిబంధనల పై అవగాహన కల్పించాలని అన్నారు. రోడ్లపై ప్రమాదాలు జరిగినప్పుడు అంబులెన్స్ ఏ ఆసుపత్రికి తీసుకుని రావాలి అనేది ఒక ప్రణాళిక ఉండాలని, దీనిపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. జిల్లా స్థాయిలో రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించి, ఆక్సిడెంట్ ప్రోన్ ఏరియాలు గుర్తించాలని, అక్కడ అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి పాఠశాల పరిసరాలలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు చిన్నతనం నుంచి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన ఉండాలని అన్నారు. రోడ్డు భద్రత ప్రమాణాలపై లోకల్ ఎఫ్.ఎం రేడియో, కేబుల్ చానల్స్ లో టెలికాస్ట్ అయ్యేలా చూడాలని తెలిపారు. రోడ్లు భవనాల శాఖ, పంచాయతీ రోడ్లు, జాతీయ రహదారుల్లో అవసరమైన సైన్ బోర్డులు ఏర్పాటు చేసేలా జిల్లా రవాణా శాఖ అధికారి పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ లక్ష్మణ్, ఈఈ పి.అర్. సుదర్శన్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.