Nirmal District SP
Nirmal District SP

Nirmal District SP: ప్రజలతో మమేకమయ్యాం.. జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాం

  • ధన, ప్రాణ రక్షణలో సఫలీకృతం
  • ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక చర్యలు
  • మత్తుపదార్థాల నియంత్రణపై ఉక్కు పాదం
  • విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల

Nirmal District SP: నిర్మల్, డిసెంబర్ 30 (మన బలగం): ఏడాది పాలనలో ఎన్నో సమస్యలను, ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం, వాటన్నింటినీ అధిగమించాం, పోలీసుల విధులకే పరిమితం కాకుండా ప్రజల కనీస అవసరాలు, ఇబ్బందులు, పరిష్కారాలు తదితర అంశాలపై దృష్టి సారించడంతో ప్రజల్లో భాగమయ్యాం, కుటుంబాల్లో తలెత్తిన చిన్నచిన్న సమస్యలతో విడిపోయిన కుటుంబాలను ఏకం చేసాం, నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనే నినాదంతో ముందుకు వెళ్లి జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొల్పగలిగామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు.

జిల్లాలో ప్రశాంత వాతావరణం
అల్లర్లకు నిలయమైన నిర్మల్ జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొల్ప గలిగామని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. 2024లో గణపతి, దుర్గ నవరాత్రి ఉత్సవాలతో పాటు అనేక కార్యక్రమాలలో ఎలాంటి సమస్య తలెత్తకుండా కార్యక్రమాలను నిర్వహించగలిగామని అన్నారు. దిలావర్‌పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేయాలని గ్రామస్తులు చేపట్టిన ఆందోళన ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా నిరోధించగలిగామని అన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం సహాయ సహకారాలతో ప్రశాంత వాతావరణంలో ఏడాది కాలం పాటు తమ పాలనను కొనసాగించినట్లు తెలిపారు.

ధన, ప్రాణ రక్షణలో సఫలీకృతులం
జిల్లా ప్రజల ధన, ప్రాణ రక్షణలో జిల్లా పోలీసు యంత్రాంగం సఫలీకృతం అయ్యిందని ఎస్పీ వివరించారు. అనేక కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలను సకాలంలో సంఘటనా స్థలాలకు చేరుకొని వారి ప్రాణాలను రక్షించగలిగామని అన్నారు. ధనం పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణం పోతే తిరిగి రాదనే విషయంలో పోలీసు యంత్రాంగం చురుకుగా పని చేసిందని స్పష్టం చేశారు. కడెం, సోన్, బాసర, భైంసా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆత్మహత్యలకు ప్రయత్నించిన కొందరిని రక్షించామని తెలిపారు. బాసర గోదావరిపై తరచుగా జరుగుతున్న ఆత్మహత్యలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు గోదావరి వంతెనపై పోలీసు పికెట్ ఏర్పాటు చేయడంతో పాటు వంతెన రక్షణ గోడల ఎత్తును పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న ఆత్మహత్యలపై స్పందించి దత్తత తీసుకున్నట్లు తెలిపారు. వారానికోసారి విద్యార్థులను కలుస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నట్లు తెలిపారు.

మత్తు పదార్థాలపై ఉక్కు పాదం
జిల్లాలో మత్తుపదార్థాల నియంత్రణపై ఉక్కు పాదం మోపినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కడెం మండలం మంగళ్ సింగ్ తండాలో సుమారు 70 లక్షల రూపాయల విలువైన గంజాయి పంటను గుర్తించి ధ్వంసం చేసినట్లు వివరించారు. వాహనాల తనిఖీలలో పోలీసు జాగిలాలను వినియోగించి గంజాయిని నియంత్రించినట్లు తెలిపారు.

నిర్మల్ పోలీస్.. మీ పోలీస్
నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనే నినాదంతో ముందుకు వెళ్లడంతో ప్రజలు తమను పూర్తిస్థాయిలో విశ్వసించారని ఎస్పీ జానకి షర్మిల వివరించారు. దీంతో జిల్లాలో ఏ మూలలో ఎలాంటి సంఘటనలు జరిగిన క్షణాల్లో తమకు సమాచారం అందించారని వివరించారు. ప్రజల పట్ల చూపిన విశ్వాసనీయత వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేశారు. ఏదేని సమస్యతో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వరికి తగిన న్యాయం జరిగే విధంగా స్పందించడం, అనుమానాస్పద వ్యక్తులు, రౌడీ షీటర్ల పై కేసులు నమోదు చేయడం గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, అక్రమ గొలుసుకట్టు వ్యాపారలపై, మటక, గుట్కా ల నియంత్రణ తదితర కార్యక్రమాలతో ప్రజలకు ఎంతో చేరువయ్యామని స్పష్టం చేశారు. జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందించడం వల్ల తాము అనుకున్న లక్ష్యాలను సాధించ గలిగామని ఎస్పీ వివరించారు. ఇదే ఒరవాడితో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *