Collector Abhilasha Abhinav
Collector Abhilasha Abhinav

Collector Abhilasha Abhinav: మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలి: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

Collector Abhilasha Abhinav: నిర్మల్, మార్చి 20 (మన బలగం): మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మార్చి 8 మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన కలెక్టర్, అధికారులకు సమాఖ్య సభ్యులు పూల మొక్కలను అందించి స్వాగతం పలికారు. కలెక్టర్, అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలు నేడు తమ స్వయంకృషితో అన్ని రంగాలలో రాణించగలుగుతున్నారని తెలిపారు. నిర్మల్ జిల్లా స్వయం సహాయక సంఘాలకు జాతీయస్థాయిలో అనేక అవార్డులు లభించాయని, ఇది ఎంతో గర్వకారణమైన విషయమని తెలిపారు. జిల్లా పేరును జాతీయస్థాయిలో నిలబెట్టినందుకుగాను డిఆర్డిఓ విజయలక్ష్మి, మహిళా సంఘాలకు అభినందనలు తెలియజేశారు.

ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతూ, భవిష్యత్తులో స్వయం సహాయక సంఘాలు మరిన్ని అవార్డులు, ప్రోత్సాహకాలు సాధించాలని ఆకాంక్షించారు. నిర్మల్ జిల్లాకు మహిళా సంఘాలే బ్రాండ్ అంబాసిడర్లని కొనియాడారు. నిర్మల్ కొయ్య బొమ్మలను భావితరాలకు అందించుటకై కొయ్య బొమ్మల తయారీలో వినియోగించే పొనికి కర్రలను ఉత్పత్తి చేయడానికి సమాఖ్య ఆధ్వర్యంలో పొనికి వనాలు పెంచడం గొప్ప విషయం అన్నారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకుగాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారితకు ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాయని తెలిపారు. పథకాలన్నింటినీ మహిళలు సద్వినియోగపరుచుకొని వ్యాపారం, స్వయం ఉపాధి ఏర్పరచుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. జిల్లా స్వయం సంఘాలు బ్యాంకు లింకేజీ, రుణ వితరణ, తదితర అంశాలలో అగ్రగామిగా ఉందన్నారు. మితిమీరిన ఎరువులు వాడి పంట ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం ద్వారా నేడు ఎన్నో రకాల వ్యాధులకు గురవుతున్నామని తెలిపారు.

సాంప్రదాయ పంటలు, సాంప్రదాయ ఆహారపు అలవాట్ల వైపు మళ్లే విధంగా మహిళా సమాఖ్య సంఘాలు అడుగులు వేయాలన్నారు. దీనికోసమే జిల్లాలో ప్రత్యేకంగా నాణ్యమైన విత్తనాలను సేకరించి, పరీక్షలు జరిపి మండలాల వారిగా మహిళా సంఘాలకు విత్తనాలను అందజేసి విత్తన నిధులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. విత్తన నిధికి సంబంధించి పోస్టర్ ను కలెక్టర్, అధికారులు, మహిళా సమాఖ్య సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. మహిళల తో కలిసి కేక్ ను కోసి మహిళలకు పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్, డిఆర్డిఓ విజయలక్ష్మి, జిల్లా మహిళా సమాఖ్య సంఘం అధ్యక్షురాలు గంగామణి, మహిళ సమాఖ్య సభ్యులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *