Group-II Examinations: నిర్మల్, డిసెంబర్ 15 (మన బలగం): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఆదివారం ప్రారంభం అయ్యాయి. జిల్లా కేంద్రంలోని దీక్ష, వశిష్ఠ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు. నిబంధనలు పక్కాగా పాటిస్తున్నారా లేదా అన్నది గమనించి అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ సాఫీగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఆదివారం ఉదయం సెషన్లో జరిగిన పరీక్షకు జిల్లాలో మొత్తం 8,080 మంది అభ్యర్థులకు గాను, 4,146 మంది హాజరు కాగా, 3,934 మంది గైర్హాజరు అయ్యారని వివరించారు. ఆది, సోమవారాలలో ఉదయం, మధ్యాహ్నం చొప్పున మొత్తం నాలుగు సెషన్లలో జరిగే గ్రూప్-2 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, పకడ్బందీగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వెల్లడించారు. ఈ పరిశీలనలో రీజినల్ కో-ఆర్డినేటర్ పీజీ రెడ్డి, పర్యవేక్షణ అధికారులు శ్రీనివాస్, గోపాల్, రవికుమార్, తహసిల్దార్లు రాజు, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.