- బస్సుయాత్రలకు భారీ స్పందన
- 17 రోజుల పాటు సాగనున్న గులాబీ బాస్ రోడ్ షోలు
- కాంగ్రెస్, బీజేపీపై విమర్శనాస్ర్తాలు
- తమపై చేస్తున్న ఆరోపణలకు ఘాటు సమాధానాలు
- రైతులు, ప్రజలకు దగ్గరయ్యేలా ప్లాన్
- పార్టీకి పూర్వ వైభవం దిశగా చర్యలు
BRS, KCR: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్రకు భారీ స్పందన వస్తున్నది. ఈ నెల 24న ప్రారంభమైన బస్సుయాత్ర మొదటిరోజు మిర్యాలగూడ, సూర్యపేటలో కొనసాగింది. మొత్తం 17 రోజుల పాటు 22 రోడ్ షోలు కేసీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఈ బస్సుయాత్రతో ఇటు రైతులకు, అటు ప్రజలకు దగ్గరయ్యేలా ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలు, పదేళ్లలో బీజేపీ హయాంలో దేశంలో బీజేపీ చేసిన తప్పులను ఎత్తిచూపుతున్నారు. మే 10న మెదక్లో నిర్వహించే సభతో బస్సుయాత్ర ముగియనున్నది.
గులాబీ బాస్ చేపట్టిన బస్సుయాత్రకు భారీ స్పందన వస్తున్నది. ఈ నెల 24న మిర్యాలగూడ, సూర్యపేట, 25న రెండోరోజు భువనగిరిలో, 26న మహబూబ్ నగర్లో రోడ్ షోలు కొనసాగాయి. ఈ రోడ్ షోలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. మోసపూరిత హామీలిచ్చి రాష్ట్రంలో గద్దెనెక్కిన కాంగ్రెస్.. వాటి అమలు తీరుపై విమర్శనాస్ర్తాలు ఎక్కుపెట్టారు. పదేండ్ల బీజేపీ పాలనలో దేశంలో జరిగిన పరిణామాలు, ప్రజలకు ఒనగూరిన లాభమేంటంటూ ప్రశ్నలు సంధిస్తూ ముందుకు సాగుతున్నారు.
కాంగ్రెస్ వైఫల్యాలపై ఫోకస్..
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు జరిగిన రోడ్ షోలలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టారు. ముఖ్యంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలకు తెలుపుతూనే వాటి అమలు సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో కరెంట్ సరఫరా, పంటలకు నీళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టు, పింఛన్లు తదితర వాటిని ప్రస్తావిస్తున్నారు. నాలుగేళ్ల కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలు మొదలయ్యాయని, నీళ్లులేక పంటలు ఎండిపోతున్నాయని, పింఛన్లు సరైన టైంకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని అంటున్నారని, దీని ద్వారా ఎవరికీ లాభం లేదని చెబుతున్నారని, మరి మూసీని శుభ్రం చేసి కాళేశ్వరంతో నింపుతామంటున్నారని, ఈ ప్రాజెక్టుతో ఉపయోగం లేనప్పుడు మూసీని నింపేందుకు ఎలా పనికి వస్తుందో చెప్పండి.. అంటూ రైతులు, ప్రజల నుంచే సమాధానాలు చెప్పిస్తున్నారు.
బీజేపీ ఓట్ల రాజకీయంపై మండిపాటు..
కేంద్రంలో పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీ.. గుడులు, పూజలు, కాషాయ జెండాల ఊరేగింపులంటూ కాలం వెళ్లదీసిందని, వాటితో రైతులు, ప్రజల కడుపు నిండుతుందా? మీరే చెప్పండి అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా బీజేపీ చేసిన మేలు ఏంటని మండిపడుతున్నారు. మోడీ హయాంలో రూపాయి పతనం, మహిళా రక్షణ, పేదరికం, నిరుద్యోగం పెరుగుదలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు వచ్చినప్పుడే బీజేపీకి దేశం, మతం గుర్తుకు వస్తుందని, వాటితో మరోసారి లబ్ధిపొందాలని చూస్తున్నదని, రైతులు, ప్రజలు తమకు ఎవరి హయాంలో మేలు జరిగిందో ఆలోచించాలంటూ వారిని ఆలోచనలో పడేస్తున్నారు.
‘బీ టీమ్’ మాటలపై ఘాటు స్పందన..
రాజకీయ చదరంగంలో ఎవరికి ఎవరు బీ టీమో ప్రజలు ఆలోచించాలని చెబుతున్నారు. భువనగిరిలో జరిగిన సభలో ఉదాహరణలో సైతం వివరించారు. భువనగిరిలో ఏం జరిగిందో చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్ చైర్మన్ను దించేశారని, ఆ తర్వాత ఒకరు చైర్మన్ను, మరొకరు వైస్ చైర్మన్ పోస్టును పంచుకున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా రైతులకు బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని ఉటంకిస్తూ ముందుకు సాగుతున్నారు. మోటార్లకు మీటర్లు పెడతామంటే అడ్డుకున్న తీరును కేసీఆర్ చెప్పుకొచ్చారు.
రైతులకు దగ్గరయ్యేలా..
బీఆర్ఎస్ హయాంలో రైతులకు ఎంతో మేలు జరిగింది. ముఖ్యంగా రైతు బంధు, 24 గంటల ఉచిత కరెంట్, రైతు బీమా తదితర వాటిని వివరిస్తున్నారు. ప్రధానంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. నాలుగు నెలల్లోనే కరెంట్ కష్టాలు తీసుకొచ్చిందని, పంటలకు నీళ్లు ఇవ్వక ఎండిపోతున్నాయని చెబుతూ ముందుకు సాగుతున్నారు. రైతుల పంట పొలాలను స్వయంగా పరిశీలిస్తూ.. గతంలో, ప్రస్తుతం పంటల పరిస్థితిని వివరిస్తూ రైతులను పరామర్శిస్తున్నారు. పంటలు ఎండిపోతున్నందుకు కారణాలను రైతులనే అడిగి తెలుసుకుంటున్నారు. దీనికితోడు బీజేపీ హయాంలో రైతులకు జరిగిన నష్టాలను చెబుతున్నారు. మోటర్లకు మీటర్లు పెట్టాలన్న బీజేపీ సర్కారు, దానిని తాను అడ్డుకున్న తీరు, రూపాయి మారకం విలువ పతనం, పేదరికం, నిరుద్యోగం పెరుగుదల వంటివి నొక్కి చెబుతున్నారు.
జనమే జనం..
కేసీఆర్ బస్సుయాత్రకు జనం నీరాజనం పలుకుతున్నారు. ఒకప్పుడు గులాబీ బాస్ ఎక్కడ సభలు పెట్టినా జనం కిక్కిరిసిపోయేవారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న బస్సుయాత్రకు సైతం అదే రేంజ్లో జనం, రైతులు తరలివస్తున్నారు. మిర్యాలగూడ, సూర్యాపేట్, భువనగిరిలో నిర్వహించిన రోడ్ షోలకు హాజరైన జనాన్ని చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది. వారిని చూసి కేసీఆర్, పార్టీలో మరింత జోష్ కనిపిస్తుంది. కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నప్పుడు జనం చప్పట్లతో మద్దతు తెలుపుతున్నారు. ఈ బస్సుయాత్రతో పార్టీకి పూర్వ వైభవం తేవాలన్న తలంపుతో ముందుకు సాగుతున్నారు.