నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్, ఎస్పీ
Bandi Sanjay: మనబలగం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న చరిత్ర చిరస్మరణీయమని, వారి జీవితం అందరికీ ఆదర్శమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్డే ఓబన్న జయంతి వేడుకలను శనివారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వడ్డే ఓబన్న చిత్రపటానికి కలెక్టర్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం సాధించడం కోసం అనేకమంది మహనీయులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వీరోచిత పోరాటం చేశారని, ఆ మహనీయులలో వడ్డే ఓబన్న తొలితరం స్వాతంత్య్ర సమర యోధుడని పేర్కొన్నారు. 1857లో జరిగిన సిపాయిల పోరాటం కంటే ముందస్తుగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు.
తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి అధికారికంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని, మహనీయులు చేసిన గొప్ప పనులను స్మరించుకోవడం వల్ల వారు అందించిన స్ఫూర్తి విలువలు మనకు తెలుస్తాయని వివరించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ప్రధాన అనుచరుడిగా బ్రిటిష్ ఇండియా కంపెనీ వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఆయన పోషించిన పాత్ర చరిత్రలో నిలిచిపోతుందని గుర్తు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ పన్నుల విధానానికి వ్యతిరేకంగా ఆయన వీరోచిత పోరాటం చేశారని అన్నారు. దేశానికి అన్ని వర్గాల వారు అన్ని ప్రాంతాల వారి పోరాట ఫలితంగానే స్వాతంత్ర్యం లభించిందని, మనం ఈరోజు స్వేచ్ఛ సాధించడం కోసం వారు చేసిన త్యాగాలను ఎప్పటికీ స్మరించుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. మహనీయుల జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం వల్ల వారు అందించే విలువలు మనందరికీ మెరుగైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయన్నారు. సమావేశంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి రాజ మనోహర్, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, డి.పి.ఆర్.ఓ. శ్రీధర్, వడ్డెర కుల సంఘం నాయకులు, ఇతర బి.సి. సంఘ నాయకులు, వడ్డెర కులస్తులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.