Nirmal Collector
Nirmal Collector

Nirmal Collector: సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ : జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

Nirmal Collector: నిర్మల్, జనవరి 21 (మన బలగం): సంక్షేమ పథకాలు అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. మంగళవారం నిర్మల్ పట్టణంలోని నాయిడివాడ, నిర్మల్ గ్రామీణ మండలం న్యూ పోచంపాడ్ గ్రామంలో నిర్వహిస్తున్న ప్రజా పాలన వార్డు, గ్రామ సభలలో కలెక్టర్ పాల్గొని ప్రజలకు, అధికారులకు పలు సూచనలు చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 26 నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల గురించి గ్రామస్తులకు వివరించారు. ఈ పథకాల కింద అర్హులను గుర్తించేందుకు వీలుగా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించనున్నట్లు కలెక్టర్ గుర్తుచేశారు. ముఖ్యంగా సాగుకు యోగ్యమైన భూములను పక్కాగా నిర్ధారించామని అన్నారు. పంటలు సాగు చేస్తున్న ప్రతి రైతుకు ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తుందని తెలిపారు. అదేవిధంగా సాగు భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రెండు విడతల్లో 12 వేల రూపాయలు అందించనున్నట్లు తెలిపారు. ఎలాంటి సాగు భూమి లేకుండా, కనీసం 20 రోజులు ఉపాధి హామీ పథకంలో పని చేసిన కుటుంబాలను అర్హులుగా గుర్తించామన్నారు.

కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్ర పరిశీలన జరిపి, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులను నిర్దారించామని తెలిపారు. ఈ మేరకు వివిధ పథకాల ద్వారా అర్హులుగా గుర్తించబడిన వారి వివరాలను గ్రామ సభలో అందరి సమక్షంలో చదివి వినిపించారు. రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తదితర పథకాల కోసం అర్హత కలిగిన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. ఆయా పథకాల కింద ఇప్పటివరకు దరఖాస్తులు చేసుకోని వారితో పాటు, అర్హత కలిగి లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని వారి నుండి కూడా అర్జీలు స్వీకరించారు. వాటిని సమగ్రంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలు, అనవసర ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు. గ్రామ సభలలో దరఖాస్తులు అందజేయవచ్చని, వీలుపడని వారు ఈ నెల 26 తరువాత ఎప్పుడైనా మండల కార్యాలయాలలోని ప్రజా పాలన సేవా కేంద్రాలకు వెళ్లి సంబంధిత పత్రాలను జాతచేస్తూ దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. వచ్చిన ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా పరిశీలించి, అర్హులందరికీ సంక్షేమ పథకాలను వర్తింపజేస్తామని కలెక్టర్ భరోసా కల్పించారు.ఈ కార్యక్రమాలలో ఆర్డీవో రత్నా కళ్యాణి, డిఎస్ఓ కిరణ్ కుమార్, తహసిల్దార్లు రాజు, సంతోష్, ప్రజలు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *