protest: కరీంనగర్, ఫిబ్రవరి 5 (మన బలగం): దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోర్టు వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 4 కార్మిక లేబర్ కోడ్లను ఏప్రిల్ మొదటి వారం నుంచి అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నదని, ప్రస్తుతం జరుగుతున్న కేంద్ర బడ్జెట్ సమావేశంలో కార్మికవర్గ యొక్క డిమాండ్లను పరిష్కరించకపోగా కార్మిక వర్గానికి తీవ్రమైన అన్యాయం చేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అమ్మడానికి సులువు చేస్తూ బీమా రంగంలో 100% ఎఫ్డీఐలను అనుమతించిందన్నారు. వీటితో పాటు ప్రభుత్వరంగ సంస్థలను కేవలం కొంతమంది కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ బడ్జెట్ సమావేశాల్లో స్పష్టంగా కనబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీటిని ఎదిరించే కార్మిక వర్గం ప్రధానమైన హక్కులను నాలుగు లేబర్ కోడ్స్ ద్వారా హరించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తోందని మండిపడ్డారు. అందులో భాగంంగానే ప్రతి బడ్జెట్లో కేటాయింపులు తగ్గిస్తున్నారని, 3 లక్షల కోట్ల బడ్జెట్కు కేవలం 86 వేల కోట్ల రూపాయలు కేటాయించారని అన్నారు. తద్వారా కూలీలను పనికి దూరం చేసే కుట్ర జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్పత్తి రంగంలో కీలకమైన రైతులు, వ్యవసాయ కార్మికులు, సంఘటిత కార్మికులు అసంఘటితరంగ కార్మికులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా ఈ బడ్జెట్ కనబడుతుందన్నారు. నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలను ఉధృతం చేయాలని సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బుచ్చన్న యాదవ్, టేకుమల్ల సమ్మయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సుంకర సంపత్, రాయికంటి శ్రీనివాన్, బీకేఎంయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బోయిని అశోక్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బండ రాజిరెడ్డి, కేదారి, సీఐటీయూ నాయకులు యు.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.