Building and Construction Workers Union: కరీంనగర్, మార్చి 16 (మన బలగం): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై రానున్న కాలంలో పోరాటాలకు కార్మిక లోకం సిద్ధం కావాలని మారగొని ప్రవీణ్ గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ కన్స్ర్టక్షన్ష్ వర్కర్స్ యూనియన్ కరీంనగర్ జిల్లా మూడో మహాసభ బద్దం ఎల్లారెడ్డి భవన్లో జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ అధ్యక్షతన జరిగింది. మహాసభ ముందు బిల్డింగ్ కన్స్ర్టక్షన్స్ వర్కర్స్ యూనియన్ జెండాను రాష్ట్ర అధ్యక్షులు గన్నారం రమేశ్ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మహాసభలో మారగోని ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న సంక్షేమ చట్టంలో నిబంధనలు ఆయా రాష్ట్రాలకు అనుకూలంగా మార్పులు చేసుకునే నిబంధనలు ఉన్నాయని దేశవ్యాప్తంగా ఒకే పద్ధతిలో ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 నుంచి సంక్షేమ బోర్డుకు పాలకవర్గం లేకుండా కార్మిక అధికారులతో నడిపిందని సంక్షేమ బోర్డు నిధులను ఇతర సంక్షేమ పథకాలకు మళ్లించుకుందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 మాసాలు అవుతున్నప్పటికీ బోర్డుకు పాలకవర్గాన్ని నియమించకుండా కాలయాపన చేస్తూ వస్తుందని తక్షణమే గుర్తించబడిన కార్మిక సంఘాల నుంచి సభ్యులతో బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
భవన నిర్మాణ కార్మికులకు 55 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇవ్వాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు తంబు వేసే పద్ధతిని తీసివేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మార్చి 28న జరిగే పార్లమెంట్ ముందు ధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్స్ర్టక్షన్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గన్నారం రమేశ్ పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడైనా వర్తించే విధంగా గుర్తింపు కార్డులు ఉండాలని, సంక్షేమ బోర్డులను రద్దు చేసే ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 28న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నామని, దీనికి వేలాదిగా కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని నరేంద్ర బిజెపి ప్రభుత్వం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్పులు చేస్తూ దేశంలో వివిధ కార్మిక సంక్షేమ కొరకు ఏర్పాటు చేసిన బోర్డులను కూడా ఒకే గుడ్డుకు కిందికి తీసుకురావాలని దీనివలన నిర్మాణ కార్మికుల కొరకు దేశవ్యాప్తంగా ఉన్న 36వేల కోట్లను ఇతర కార్మిక సంక్షేమానికి మళ్ళించేందుకు చేస్తున్న కుట్రలు తిప్పి కొట్టాలని కార్మికుల సంక్షేమ బోర్డులను కొనసాగిస్తూ స్వతంత్రంగా పనిచేసే విధంగా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ బోర్డు ఏర్పాటు జరిగి నుండి ఇప్పటికి 18 లక్షల వరకు సభ్యులు నమోదయి ఉన్నారని తెలిపారు. కార్మికుల హక్కుల సాధనకై ప్రతి ఒక్క కార్మికుడు ఉద్యమించాలన్నారు. ఈ మహాసభలో కార్యదర్శి నివేదికను జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల సమ్మయ్య ప్రవేశపెట్టారు. ఈ మహాసభలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ ప్రధాన కార్యదర్శి పిట్టల సమ్మయ్య రాష్ట్రనాయకులు కడారి రాములు, జి రాజు జిల్లా నాయకులు పిట్టల శ్రీనివాస్, కన్నెం సదానందం, అలిశెట్టి చంద్రయ్య,పిట్టల రమ పిట్టల రాజేశ్వరి, అల్లపు లావణ్య, పున్న మహేశ్వరి, కచ్చకాయల తిరుమల, పులికోట రవి లతోపాటు 200 మంది భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.
