Indiramma’s houses: నిర్మల్, మార్చి 23 (మన బలగం): హౌసింగ్ డిపార్ట్మెంట్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ర్టక్షన్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ మోడల్ ఇండ్ల నిర్మాణానికి నిర్మల్ జిల్లాలోని వివిధ మండలాలు, పట్టణాల నుంచి ఎంపిక చేసిన తాపీ మేస్త్రీల ఆరు రోజుల శిక్షణ కార్యక్రమం ఆదివారం నిర్మల్లోని ఎన్టీఆర్ స్టేడియం బిల్డింగ్లో ముగిసింది. మేస్త్రీలతో కలిసి ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి సంబంధించిన ముగ్గులను, మోడల్ హౌస్ నిర్మాణానికి సంబంధించి నేర్చుకున్న మెలకువలను హౌసింగ్ పీడీ కె.రాజేశ్వర్ అడిగి తెలుసుకున్నారు. శిక్షణ పొందిన మేస్త్రీలు ఈ శిక్షణ తమకు ఇళ్ల నిర్మాణం చేపట్టే క్రమంలో ఎంతగానో దోహదపడుతుందని తమకు తెలువని అనేక విషయాలను ఇక్కడ నేర్చుకున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పీడీ కే.రాజేశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతుందన్నారు. ఇప్పటికే గ్రామాల్లో ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తున్నామన్నారు. జిల్లాలో సరైన నివాసం లేనటువంటి అర్హులైన నిరుపేద ప్రజలకు ఇంటిని నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని తక్కువ ఖర్చుతో నాణ్యతా ప్రమాణాలతో నిర్మించి ఇవ్వడానికి మేస్త్రీల ప్రాముఖ్యత చాలా ముఖ్యమని నైపుణ్యం తెలిపారు. మేస్త్రీల కొరత ఉందని, ఈ శిక్షణ ఇండ్ల నిర్మాణం కోసం ఎంతగానో ఉపయోగపడుతుందని సూచించారు. కార్యక్రమంలో న్యాక్ శిక్షకులు ఎం.మహేష్ కుమార్ శిక్షణ పొందిన మేస్త్రిలు పాల్గొన్నారు.